2005లో విడుదలైన అతడు సినిమా థియేటర్లో అంతగా హిట్ కాలేదు.. కానీ ఇది టీవీలో హిట్. ఎంతలా అంటే వేసినా ప్రతిసారీ మంచి రేటింగ్స్ వచ్చేంతగా. అందుకే ఈ సినిమా ఇప్పటికి 1500సార్లు ప్రసారం అయిన మొదటి తెలుగు సినిమాగా రికార్డు సంపాదించింది.
అతడు సినిమాని ఎన్నిసార్లు చూసినా బోర్ రాదు. అందుకేనేమో స్టార్ మా టీవీ వాళ్లు ఈ సినిమాని 20 యేండ్లుగా ఇప్పటి వరకు 1500 సార్లు ప్రసారం చేశారు. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, ఎమోషన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇలా అన్ని సమపాళ్లలో ఉంటాయి. అందుకే ఈ సినిమాలో ఒక్కో డైలాగు, ఒక్కో క్యారెక్టర్ అలా మనసులో చెరగని ముద్ర వేశాయి. ఈ సినిమాకి ప్రధాన బలం త్రివిక్రమ్ రాసిన డైలాగులు. అంతేకాదు.. పార్ధుగా మహేష్బాబు, పూరీగా త్రిష.. వారి కెమిస్ట్రీ వెరే లెవల్ అన్నవిధంగా సినిమా సాగుతుంది.
ఈ సినిమాలో మహేష్ కామెడీ టైమింగ్, బ్రహ్మానందంతో కొన్ని సంభాషణలు చాలా వరకు ఇప్పటికీ రిపీట్గా చూడాలనిపిస్తుంటుంది. ఇక సినిమా విషయానికొస్తే.. కిరాయి హంతకుడైన ఒక వ్యక్తి పారిపోతుంటాడు. అదే సమయంలో ఇంటికి దూరమైన వ్యక్తి ట్రైన్లో పరిచయమవుతాడు. హంతకుడిని కాల్చబోయి వేరే వ్యక్తి దానికి బలవుతాడు. ఆ బలైన వ్యక్తి స్థానంలో ఈ కిరాయి హంతకుడు చేరతాడు. కానీ అక్కడికి వెళ్లాక ఆ కుటుంబం అతడిని ప్రేమతో కట్టిపడేస్తారు. కొంత బంధాలు, బంధుత్వాలు తనని మార్చేస్తాయి. అక్కడ కుటుంబానికి కష్టం వస్తే తనకే వచ్చినట్లుగా ఫీలై వారితో కొట్లాటకు దిగుతాడు. అలా ఆ కుటుంబాన్ని ఆపదలో నుంచి గట్టెక్కిస్తాడు. మధ్యలో తను చంపాలనుకున్న వ్యక్తి తన వల్ల కాకుండా వేరే వారి వల్ల బలయ్యాడని కూడా అర్థమవుతుంది. అదే సమయంలో తనని వెతుక్కుంటూ పోలీసులు వస్తారు. అప్పుడు అతడు అన్ని సమస్యలను దాటి ఈ కుటుంబానికి చేరువైతాడు.

ఈ సినిమా కథ చదివినా కూడా.. మళ్లీ ఒకసారి చూస్తే బాగుండూ అనిపిస్తున్నది కదా! ఈ సినిమా మ్యాజిక్ అలాంటిది. ఇప్పటికీ ఓటీటీలో ఉన్నా, కొన్నిసీన్లు యూటూబ్యూలో కనిపిస్తున్న కూడా మా టీవీలో వేస్తే చూసే వాళ్లు ఉన్నారు. అందుకే ఈ సినిమా ఇప్పటికీ 1500 సార్లు ప్రసారం చేశారు. అందుకే సియాసత్ నివేదిక ప్రకారం ఈ సినిమా అత్యధిక సార్లు ప్రసారమైన తెలుగు సినిమాగా రికార్డుకెక్కిందని ప్రకటించింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా చేరుకోని కొత్త ప్రపంచ రికార్డు ఇది.
అతడు సినిమాలో తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో హృదయాలను గెలుచుకున్నందుకు మహేష్ బాబు రెండవసారి ఉత్తమ నటుడిగా ఈ సినిమాకు నంది అవార్డును కూడా అందుకున్నాడు. అంతేకాదు.. ఉత్తమ మాటల మాంత్రికుడికి కూడా ఈ సినిమాకు నంది అవార్డు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 22 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కాకుండా మహేష్బాబు నటించిన ఖలేజా, గుంటూరు కారం సినిమాలు కూడా టెలివిజన్ హిట్లుగా ఇప్పటికీ ప్రసారం అవుతున్నాయి.