రామయ్యకు బంటుగా మారి.. సీతమ్మ తల్లి శోకాన్ని తీర్చినవాడు మన ఆంజనేయుడు. మరి భక్తుల కోరికలను ఆ భగవంతుడు తీర్చకుండా ఉంటాడా? ఆంజనేయుడికి తమలపాకులు మాల వేస్తారు. లేదా తమలపాకులను విగ్రహానికి అతికిస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా?
ఆంజనేయుడు శివాంశ సంభూతుడని అందరికీ తెలుసు. శివుని పదకొండవ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేరు ఉంది. అయితే ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని అంటుంటారు. అసలు ఆయనకు తమలపాకుల మీద మక్కువ పుట్టడానికి వెనుక రెండు కథలున్నాయి. అవేంటో చదువండి.
మొదటి కథ..
ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని తెలియచేశాడు. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడని అంటారు. ఆంజనేయస్వామి రుద్ర సంభూతుడు కనుక.. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖం లభిస్తాయి.

మరో కథ..
అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాములవారి సందేశం ఇచ్చాడని తెలుసు కదా! ఆ సమయంలో అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారాలలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. హస్త, మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. స్వామి మహిమల గురించి పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి. హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం. ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల కార్యదీక్షా దక్షత, మాట నేర్పు ఇలాంటివెన్నో తెలుసుకోవాలి.
పూజించడం వల్ల..

- ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది.
- ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమల పాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి.
- సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.
- కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.
- వ్యాపారంలో నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది.
- శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది
- సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.
- హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది.