కలియుగ ప్రత్యక్షదైవంగా ఆ వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తుంటారు. తిరుమల వెళ్లిన వారు మొక్కుబడిగా తలనీలాలు సమర్పించడం మామూలే. కేవలం తిరుమలలోనే కాదు.. పుట్టిన బిడ్డ నుంచి ముదుసలి వరకు ఇతర గుళ్లలో కూడా తలనీలాలిస్తుంటారు. అసలెందుకు ఇలా..?
అన్నా లెజినోవా.. పవన్ మూడవ భార్యగా అందరికీ సుపరిచితమే. ఆమె తన కొడుకు బాగుంటే ఆ ఏడుకొండల వాడికి తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుంది. అలాగే వెళ్లి తలనీలాలు సమర్పించి ఆ దేవుడికి సేవ చేసుకుంది. అసలు ఈ తలనీలాలు ఎందుకు ఇస్తారోనని ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడనే కాదు.. ఇతర ఆలయాల్లోనూ తలనీలాలు ఇవ్వడమనే సంప్రదాయం ఉంటుంది. అసలు ఇలా తలనీలాలు ఇయ్యడం వెనుక కారణమేంటో తెలుసా?

జీవితంలో భరించలేని కష్టం వచ్చినప్పుడు, తట్టుకోలేని ఆపదలు వచ్చినప్పుడు కలియుగ దైవం శ్రీనివాసుడు భక్తులను కాపాడుతాడని నమ్ముతారు. ఆ బాధలు తీరితే తలనీలాలు సమర్పిస్తామని ఆ కొండల రాయునికి మొక్కుకుంటారు. అలా అనుకోవడమే ఆలస్యం ఆ బాధలు ఇట్టే తీరిపోతాయి. శ్రీనివాసునికి తలనీలాలే మొక్కుబడిగా ఎందుకు ఇస్తారంటే మనిషి తెలిసి తెలియకో చేసే పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించి ఉంటాయంట. అందుకే స్వామి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు ఇస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని శాస్త్ర వచనం. ఇది కాకుండా ఇంకా చాలా కథలు కూడా ఉన్నాయి. అవేంటో పూర్తిగా చదువండి.
శ్రీవారికి తలనీలాలు..
వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తితో సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరక ముందు, తీరిన తరువాత స్వామి వారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది.

పసిపిల్లలకు..
పురాతన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతీ మనిషికి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు 16 రకాల కర్మలను జరిపించాల్సి ఉంటుందని హిందూ ధర్మ శాస్త్రం సూచించింది. ఇందులో భాగంగానే పుట్టిన బిడ్డకు 11 నెల వయసులో కానీ, మూడేళ్ళ వయసులో కానీ పుట్టు వెంట్రుకలు తీయించడం సంప్రదాయం. ఇలా ఎందుకంటే శిశువు జన్మించే సమయంలో ముందుగా తల్లి గర్భం నుంచి తల మాత్రమే బయటకు వస్తుంది. అప్పుడే జన్మించిన శిశువు తలను అంటి పెట్టుకొని గత జన్మ వాసనలు పాపాల రూపంలో ఉంటాయని శాస్త్ర వచనం. అందుకే పుట్టిన శిశువుకు ఏడాది లోపు దేవుని సమక్షంలో పుట్టు వెంట్రుకలు తీయించడం అనేది ఒక సదాచారం.
మహాభారతంలో..
జయద్రధుడు(సైంధవుడు), దౌపదిని చెడు దృష్టితో చూస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త ఈ సైంధవుడు. అంటే పాండవులకి కూడా దుశ్శల ఆడపడుచు. సైంధవుడు ఆమె భర్త. అయినా భార్యని అవమానించాడనే కోపం భీముడికి పట్టశక్యం కాదు. అతనిని సంహరించేందుకు భీముడు సిద్ధపడతాడు. ఆ నేపథ్యంలో ధర్మరాజు తమ్ముణ్ణి వారిస్తాడు. చెల్లెలి పసుపు కుంకుమలు తీసేస్తూ , అతన్ని వధించడం అన్నలుగా తమకి ధర్మసమ్మతం కాదని హితవు చెబుతాడు. అలా అని అతన్ని వదిలేయమనలేదు. ఆ పనికి పురికొల్పిన అతని అహంకారాన్ని తుంచేయమన్నారు. తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని ధర్మరాజు ధర్మసూక్ష్మాన్నీ వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు. అదే విధంగా రుక్మిణిని తీసుకెళుతున్న మాధవుణ్ణి ఎదుర్కొన్న ఆమె అన్న రుక్మిణికి కూడా భగవానుడు అదే శిక్షవేస్తారు.
దీనిని బట్టి తలపైన వెంట్రుకలు అనేవి మన అహంకారానికి ప్రతీకలని తెలుస్తోందికదా ! ఆ అహంకారమే భగవంతునితో వైరానికి కారణం. అహాన్ని తొలగిస్తే ఆ పరమాత్మ స్వయంగా మనల్ని ఆదరిస్తారు. ఆయన వాత్సల్యం మనకి అర్థమవుతుంది. ఆ పరమాత్మకీ, మనకీ ఉన్న అడ్డుతెర ఆ అహంకారం మాత్రమే కదా ! అందుకే తలనీలాలిస్తే చాలు మన అహంకారాన్ని తీసి ఆ స్వామీ పాదాల దగ్గర పెట్టినట్టే. అహంకారానికి ప్రతీక అయినా మన శిరస్సుని ఖండించి ఆయనకి అర్పించినట్టే . ఆయన అనుగ్రహించడానికి ఆ కరుణని దోసిళ్ళతో ఆస్వాదించడానికి మనం ఇంతకన్నా ఏం చేయగలం చెప్పండి.