రక్తదానం అందరూ చేస్తారు. కానీ రక్తదానం చేయడంలో రికార్డు కొట్టేయడమే కాదు.. ఏకంగా 2.4మిలియన్ మంది పసి పిల్లల ప్రాణాలను కాపాడాడు.. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ హారిసన్. ఆయన ఈ మధ్యే చనిపోయారు. ధన్యజీవిగా మిగిలిన ఆయన గురించి తెలుసుకోకపోతే ఎలా?
గోల్డెన్ హ్యాండ్ అనే పేరుతో ప్రసిద్ది చెందిన జేమ్స్ హారిసన్ 88 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన 81 యేండ్ల వయసు వరకు రక్తదానం చేస్తూనే ఉన్నారు. అప్పటివరకు ఆయన 1,173సార్లు ఈ రక్తదానం చేశారు. అంటే దాదాపు రెండువారాలకొకసారి కచ్చితంగా రక్తదానం చేసేవారు. దీంతో దాదాపు 2.4మిలియన్ల మంది నవజాత శిశువులు హెమోలిటిక్ వ్యాధి నుంచి బయటపడ్డారు. యాంటీ డి మందుల్లో ఈ ప్లాస్మాను ఉపయోగించారు.
రక్తదానంతో..
హారిసన్ మొదట 1954లో మొదట రక్తదానం చేశాడు. అప్పటికీ ఆయన వయసు కేవలం 18 సంవత్సరాలు. అప్పటి నుంచి అలుపెరుగకుండా రక్తదానం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు మొదలైన ఆయన రక్తదానం 2018లో ఆపేసేవరకు 1,173 సార్లు ఇచ్చారు. ఇది ఒక అరుదైన రికార్డు. అందుకే ఆయనను గోల్డెన్ హ్యాండ్గా ఆస్ట్రేలియా ప్రజలు అభివర్ణిస్తారు. ఆయన కూతురు కూడా ఆయన రక్తదానం వల్ల లాభం పొందిన వ్యక్తిలో ఒకరు. అందుకే తన కుటుంబం కూడా ఎప్పుడూ రక్తదానాన్ని అడ్డుకోలేదు.

ఎందుకంత స్పెషల్..
ఎంతోమంది రక్తదానం చేస్తారు. కానీ అందరిలో హారిసన్ రక్తం గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఎందుకంటే ఆయన రక్తంలో అరుదైన యాంటీ – డి అనే యాంటీ బయాటిక్స్ ఉన్నాయి. అసలు 14 యేండ్ల వయసులో ఛాతీ శస్త్ర చికిత్స సమయంలో భారీ రక్త మార్పిడి జరిగింది. ఆ తర్వాత ఆయనకు ఈ వరం దక్కింది. 1960 మధ్యకాలంలో యాంటీ-డి చికిత్స రాకమునుపు ప్రతి ఇద్దరు శిశువుల్లో ఒకరు మరణించేవారు హీమోలిటిక్ డిసీజ్, హెచ్డిఎఫ్ఎన్ వల్ల… అంటే తల్లికి, శిశువు లేదా పిండానికీ నడుమ ఆర్హెచ్డి నెగెటివ్, పాజిటివ్ తేడాలు ఉన్నప్పుడు శిశువుకు ప్రాణాంతకం అవుతుంది. ఇదుగో జేమ్స్ రక్తంలో ఉన్నట్టు యాంటీ-డీ ఉన్న రక్తాన్ని ఎక్కిస్తే తల్లి సేఫ్, శిశువూ ఇద్దరూ రక్షించబడుతారు. ఇలాంటి యాంటీ-డీ యాంటీ బాడీస్ ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. అందువల్లే హారసిన్ చనిపోయినా కూడా ధన్యజీవిగా అందరిలో నిలిచిపోతాడు.