చిన్న వయసులోనే అందాల కిరీటం దక్కించుకోవాలని కలలు కన్నది. అనుకున్నట్టే 2023లో ఫెమినా మిస్ ఇండియా అయింది. ఇప్పుడు మన దేశం తరుపున ప్రపంచ సుందరి బరిలో నిలిచింది. ఆమే నందినీ గుప్తా.
పదేండ్ల వయసులో టీవీలో అందాల పోటీలను చూస్తున్న నందినీకి వాళ్లు పెట్టే కిరీటం బాగా నచ్చింది. అలా పెట్టుకుంటే రాకుమారిలా కనిపిస్తారని అనిపించిందా వయసులో. పెద్దయ్యాక అదొక బాధ్యతగా అనిపించింది. అందుకే పట్టుదలగా శ్రమించి మిస్ ఇండియా పోటీలో రాణించింది. ప్రస్తుతం టాప్ రేస్లోనే ఈ అమ్మడు ఉన్నట్లుగా అందరూ భావిస్తున్నారు.

ఫ్యాషన్ వైపు..
హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయని అందరికీ తెలుసు. ఈ సంవత్సరం మన దేశం తరుపున నందినీ గుప్తా పోటీ పడనుంది. ఆమె రాజస్థాన్లోని కోటాలో జన్మించింది. మొదటి నుంచి చాలా చురుకైన అమ్మాయి. స్కూల్, కాలేజీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేది. బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. అందాల కిరీటం దక్కించుకోవాలనే ఆశతో ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. అంతేకాదు హీస్ట్ అనే బాలీవుడ్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్లో కనిపించింది.
మహిళలకు అండగా..
ఉద్యోగం చేయడం ఆ సంపాదనతో బతుకడం మొదటి నుంచి ఇష్టం లేదు నందినీకి. నలుగురికీ ఉపాధి కల్పించినప్పుడే జీవితానికి ఒక సార్థకత అనుకుంది. అందుకే కోటాకి దగ్గరలో కైతూన్ అనే ప్రాంతం ఉంది. అక్కడ డోరియా అనే వస్త్రం మహిళలు నేస్తారు. వారి దగ్గర నుంచి ఆ వస్త్రాన్ని తక్కువ ధరకు కొన్ని మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మడం గమనించింది నందినీ. వారి కళకు ప్రాచుర్యాన్ని కల్పిస్తూ వారికీ గుర్తింపు తీసుకొచ్చింది.
సమాజ సేవలో..
ప్రియాంక చోప్రాలాగా అంతర్జాతీయ స్థాయిలో మన దేశం గర్వపడేలా చేయాలని భావిస్తున్నది నందిని. అంతేకాదు.. సమాజ సేవ చేసే రతన్ టాటా ఆమెకు ఆదర్శం అంటున్నది. ఆయనలా సమాజ సేవ చేస్తూ అందరి ఆదరాభిమానాలు సంపాదించాలనుకుంటున్నది.