తిన‌గ‌లిగే బొకేల‌ను చేస్తున్న త‌ల్లీకూతుళ్లు!

గులాబీ పువ్వును తినాల‌ని అనుకుంటారా? నిజ‌మైనా పువ్వు కాదు లెండి.. ఇది తినే గులాబీ! న‌మ్మ‌కం లేదు క‌దా! ఈ అమ్మాయి త‌యారు చేసి తీపి గులాబీల‌ను చూస్తే వావ్ అంటూ నోరెళ్ల‌బెట్టాల్సిందే!

ముంబైకి చెందిన తల్లి-కూతురు శ్రీనాల్ – రూపాల్ బడియాని స్నేహితుల‌కు, బంధువుల‌కు చిరస్మరణీయమైన బహుమతిని ఇవ్వాల‌నుకున్నారు. వారి తపనే వారిని పువ్వులు, డెజర్ట్‌ల అద్భుతమైన కలయికను పరిచయం చేయడానికి దారితీసింది. ఇది ప్రముఖులతో సహా చాలా మంది హృదయాలను దోచుకుంది. మూడు ద‌శాబ్దాలుగా ఈవెంట్ డెక‌రేష‌న్‌లో ఉంది ఈ కుటుంబం. ఒక‌రోజు ఫ‌న్నీగా వీరికి ఈ తీపి పువ్వుల బొకేల ఆలోచ‌న వ‌చ్చింది. ఇంట్లోనే వారు దీనికోసం ప్ర‌యోగాలు చేశారు. మెల్ల‌గా వారి ఆలోచ‌న‌కు ఒక కార్య‌రూపం వ‌చ్చింది. ఆ త‌ర్వాత మెల్ల‌గా త‌మ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు.

విదేశాల్లో..
శ్రీనాల్‌.. యూకేలో ఫార్మ‌సీలో మాస్ట‌ర్స్ పూర్తి చేసింది. ఆ స‌మ‌యంలోనే త‌న‌కు క్రియేటివ్‌గా ఏదైనా చేయాల‌నే ఆలోచ‌న మొద‌లైంది. విదేశాల్లో యూనిక్‌గా బ‌హుమ‌తులు ఇచ్చుకోవ‌డం చూసింది. అదే ఇండియాలో కూడా ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తీ సంద‌ర్భంలోనూ బ‌హుమ‌తులు ఇవ్వ‌డం గ‌మ‌నించింది. కానీ అదే మార్కెట్‌లో ఉన్న బోరింగ్ గిఫ్ట్‌లు కాకుండా త‌నేదైనా కొత్త‌గా చేయాల‌ని ఆలోచించింది. యూకేలో త‌ను తినే బొకేల‌ను చూసింది. ఇండియాకి తిరిగి వ‌చ్చాక ఇదే విష‌యం త‌ల్లితో పంచుకుంది. చిన్న‌ప్ప‌టి నుంచి శ్రీ‌నాల్‌కి డ్రాయింగ్ మీద మ‌క్కువ‌. అందుకే బొకేలు ఎలా చేయాల‌నేది ముందే స్కెచ్చింగ్ చేసుకునేది. రూపాల్‌కి బేకింగ్ చేయ‌డం తెలియ‌దు. కానీ కూతురు ఆలోచ‌న‌కు ఒక కార్య‌రూపం ఇవ్వాల‌ని ప‌ట్టుద‌ల‌తో నేర్చుకుంది. కూతురికి తోడుగా నిలిచి వ్యాపారంలో తాను చేయూత‌గా నిలిచింది.

సోష‌ల్‌మీడియాలో..
శ్రీ‌నాల్‌ వారి క‌ప్‌కేక్ బొకేలను ఉంచేది. అలా ఆర్డ‌ర్స్ మొద‌ల‌య్యాయి. 2019లో మొద‌ట ఫ్రెండ్స్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యుల నుంచి ఆర్డ‌ర్స్ వ‌చ్చాయి. ఆ త‌ర్వాత మెల్ల‌గా బ‌ట‌ర్ క్రీమ్ టెక్నిక్స్ కూడా నేర్చుకున్నారు. క‌ప్ కేక్‌ల‌ను చూస్తే నిజ‌మైన పువ్వులే అనుకుంటారు. టేస్టీగా ఉండ‌డమే కాదు.. అందంగా బొకే క‌నిపించేలా ఈ బొకేల‌ను త‌యారుచేస్తున్నారు. కోవిడ్‌-19 లో బిజినెస్‌కి బ్రేక్ ప‌డింది. కానీ ఆ స‌మ‌యంలో మ‌రింత ప‌ర్‌ఫెక్ట్‌గా ఈ బొకేలు చేసేందుకు స‌మ‌యం దొరికింది. అలా 2022లో మళ్లీ కొత్త‌గా ఈ బిజినెస్‌ని మొద‌లు పెట్టారు. మెల్ల‌గా బిజినెస్ అంచెలంచెలుగా ఎదిగింది.

సెల‌బ్రిటీలు సైతం..
2023 నుంచి ఆర్డ‌ర్‌లు పెరిగాయి. అప్ప‌టిదాకా ఇంట్లో కిచెన్ నుంచి వీరి ఈ బొకేల‌ను చేసి పంపేవారు. ఇప్పుడు బ‌య‌ట ఒక కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రియా తివారీ అనే చెఫ్‌ని పెట్టుకున్నారు చాలా డెలికేట్ ఐట‌మ్స్ కాబ‌ట్టి స్వంతంగా కొంద‌రు మ‌నుషుల‌ను పెట్టి డెలివ‌రీ చేస్తున్నారు. తొంద‌ర‌లోనే ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. నేహాధూపియా, సోన‌మ్‌క‌పూర్‌, అదిరిరావు హైద‌రీ.. ఇలా సెల‌బ్రిటీలు సైతం ఈ బొకేలకు ఫిదా అయిపోయారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress