ప్రపంచసుందరి 2025 కిరీటాన్ని థాయిలాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్ శ్రీ గెలుచుకుంది. ఈ సుందరి వెనుక ఒక కన్నీటి కథ ఉంది. క్యాన్సర్తో పోరాడి గెలిచి ఈ స్థాయిలో నిలుచుంది. ఇప్పుడు క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది.
ప్రపంచసుందరి 2025 కిరీటం కోసం 108 దేశాల నుంచి సుందరీమణులు పోటీ పడ్డారు. అందులో 16మంది క్యార్టర్ ఫైనల్స్కి చేరుకున్నారు. చివరి రౌండ్లో నాలుగు ఖండాలు.. అమెరికా కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా భామలు మిగిలారు. వీరిలో థాయిలాండ్ భామ అయిన ఒపాల్ సుచతా చువాంగ్శ్రీ ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది. థాయిలాండ్ నుంచి ఈ కిరీటం పొందిన మొదటి భామగా కూడా ఈమె రికార్డు సృష్టించింది. ఈ కిరీటంతో పాటు ఆమె మల్టీమీడియా అవార్డును కూడా సొంతం చేసుకుంది.
వివాదాలతో ఎంట్రీ..
ఒపాల్ అంతర్జాతీయ పోటీలలో సుపరిచితురాలు. 2025 మిస్ వరల్డ్ పోటీలో థాయిలాండ్కు ప్రాతినిధ్యం వహించే హక్కును సంపాదించడానికి చాలా కష్టాలు పడింది. 2024లో థాయిలాండ్కు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తిరిగి తీసుకురావడానికి ఆమె బలమైన పోటీదారుగా నిలిచింది. కానీ మెక్సికోలో జరిగిన పోటీ ముగింపులో మూడవ రన్నరప్గా నిలిచింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకురాలు నవత్ ఇత్సారగ్రిసిల్ ఈ సంవత్సరం ప్రారంభంలో మిస్ యూనివర్స్ పోటీకి థాయ్ జాతీయ ఫ్రాంచైజీని పొందిన తర్వాత ఆమె జాతీయ సంస్థ మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్తో విభేదించింది. మాజీ మిస్ యూనివర్స్ థాయిలాండ్ నిర్వాహకురాలు ఆ తర్వాత థాయ్ మిస్ వరల్డ్ లైసెన్స్దారుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తరువాత 72వ మిస్ వరల్డ్ పోటీలో పోటీ పడటానికి చువాంగ్శ్రీని నియమించింది. అలా చువాంగ్శ్రీ ఈ పోటీలోకి అడుగుపెట్టింది.

క్యాన్సర్ బారిన..
16 సంవత్సరాల వయస్సులో ఒపాల్ రొమ్ము క్యాన్సర్బారిన పడింది. దీంతో సర్జరీ ద్వారా రొమ్ము తొలగింపు చేయించుకున్నది. ఆ సమయంలో జీవితంలో తన కలలను నిజం చేసుకుంటానో లేదోనని చాలా భయపడిందట చువాంగ్శ్రీ. కానీ ఆమె మనోధైర్యం ఆమెను మళ్లీ నిలబెట్టింది. ఆ తర్వాత ఒపాల్ రొమ్ము క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. అవగాహన కలిగించడమే కాదు.. క్యాన్సర్ బాధితుల కోసం నిధులను సేకరించాలని నిశ్చయించుకుంది. ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నవారు, జయించినవారు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులతో ఇంటర్వ్యూలను కలిగి ఉన్న పాడ్కాస్ట్లను రూపొందించాలని అనుకుంటున్నది. అంతేకాదు.. బ్రాలు, టీ-షర్టులు, ఇతర ఆభరణాలను ఉత్పత్తి చేయడం ద్వారా నిధులను సేకరించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా మహిళలు ఈ వ్యాధి నుంచి విముక్తి పొందేలా సహాయం చేయడమే ఆమె లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.

కిరీటం వైపు..
క్యాన్సర్ని జయించిన తర్వాత తన చదువును కొనసాగించింది ఒపాల్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ విద్యార్థిని అయిన ఒపాల్కి మనస్తత్వశాస్త్రం, మానవ శాస్త్రంలో కూడా ఆసక్తి ఉంది. 18 యేండ్ల వయసులో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. 2021లో డిసెంబర్లో జరిగిన మిస్ రత్తనకోసిన్ పోటీతో సుచత తన అందాల పోటీల కెరీర్ను ప్రారంభించింది. కానీ ఆమె పోటీలో స్థానం సంపాదించుకోలేదు. కానీ ఆ తర్వాత ఆమె మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2022 పోటీలో పాల్గొని మూడవ రన్నరప్గా నిలిచింది. అసలు మొదటి రన్నరప్ నికోలీన్ లిమ్స్నుకాన్ రాజీనామా తర్వాత ఆమె రెండవ రన్నరప్గా పదోన్నతి పొందింది. ఆ తర్వాత 2024లో మిస్ యూనివర్స్ థాయిలాండ్ పోటీలో బ్యాంకాక్కు ప్రాతినిధ్యం వహించడానికి సుచత నియమితులయ్యారు. దాంట్లో ఆమె మిస్ చార్మింగ్ టాలెంట్, మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్తో సహా అనేక ప్రత్యేక అవార్డులను గెలుచుకుంది. మిస్ వరల్డ్ 2025కి థాయిలాండ్ ప్రతినిధిగా ఆమె నియామకం తర్వాత, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఆమెను మూడవ రన్నరప్ స్థానం నుంచి తొలగించినట్లు ప్రకటించింది.

జీవించడమే విజయం..
“నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు పెంపుడు జంతువులన్నా మక్కువ ఎక్కువ. నా దాగ్గర పదహారు పిల్లులు, ఐదు కుక్కలను పెంచుకుంటున్నా. మీరు జీవించినందున ఒక జీవితం సులభంగా ఊపిరి పీల్చుకుందని తెలుసుకోండి. ఇదే విజయం సాధించడమంటే నా దృష్టిలో “అని అంటున్నది ఒపాల్.