పసుపు, నీలం కాంబినేషన్ కంచిపట్టు చీర కట్టి, బ్లౌజ్ లేకుండా.. మెడలో నగలు వేసుకొని మరీ తన కండలను చూపిస్తూ ఫొటోషూట్ చేయించింది చిత్రా పురుషోత్తం. కర్ణాటకకి చెందిన ఈ బాడీ బిల్డర్ గురించే నెట్టింట ఇప్పుడు చర్చ జరుగుతున్నది.

పెండ్లి ఫొటోషూట్ అంటే కాస్త కోమలంగా పెండ్లికూతురు ముస్తాబై కనిపిస్తుంది. డిఫరెంట్ థీమ్తో ఫొటోషూట్ చేయించుకోవడం కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఈ బాడీబిల్డర్ కూడా కాస్త వినూత్నంగా తన కపుల్ ఫొటోషూట్ చేయించుకోవాలనుకుంది. అందుకే సంప్రదాయంగా చీరకట్టి.. కండలు కనిపించేలా తన కాబోయే భర్తతో ఫొటోలను తీయించుకుంది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.
పట్టు చీరకట్టి.. బంగారు నగలు వేసుకొని, వడ్డాణం, పాపిడిబిళ్ల, గాజులు, చెవిపోగులు పెట్టుకొని, కొప్పులో మల్లెపువ్వులతో తయారైంది చిత్రా పురుషోత్తం. సింపుల్ మేకప్ కూడా ఆమె అందని రెట్టింపు చేసింది. అయితే అందరి పెండ్లికూతుళ్లలా ఉంటే తన స్పెషల్ ఏమంది అనుకుంది. అందుకే తను పెంచిన కండలను చూపించేలా ఒక వీడియో తీసి మనస్తత్వమే అంతా అంటూ క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి 7.5మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక అందరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బ్యూటీ విత్ ఫిట్నెస్ అంటూ ఇలా కామెంట్లు పెడుతున్నారు.
చిత్ర పురుషోత్తంకి ఇన్స్టాలో 1,38,000 ఫాలోవర్లు ఉన్నాయి. ఆమెకి తన చిన్ననాటి స్నేహితుడైన కిరణ్ రాజ్ని పెళ్లాడబోతున్నది. ఆమె ఫిట్నెస్ పోటీలలో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది. మిస్ ఇండియా ఫిట్నెస్ అండ్ వెల్నెస్, మిస్ సౌత్ ఇండియా, మిస్ మైసూర్ వడయార్, మిస్ బెంగళూరులను గెలుచుకుంది. ఆమె మిస్ కర్ణాటక పోటీలో టాప్ ఐదు పోటీదారులలో కూడా స్థానం సంపాదించింది.