గణపతి, వినాయకుడు.. ఇలా పలు పేర్లతో ఆ గణాధిపతిని పిలుస్తుంటాం. అయితే వినాయకుడి రూపంలాగే ఉండే వినాయకి గురించి ఎప్పుడైనా విన్నారా? ఆమె వినాయకుడిలా ఉండడం వెనుక కారణమేంటో తెలుసా?
వినాయకుడి భార్యలు.. సిద్ధి, బుద్ధి ఆయనని వారి సమేతంగా కొన్నిచోట్ల కొలుస్తారు. మరికొన్ని చోట్ల వృద్ధి అనే మరో దేవత పేరు కూడా గణపతి ధర్మపత్నిగా వినిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే లక్ష్మీ లేదా సరస్వతీదేవి వినాయకునికి తోడుగా కనిపిస్తారు. కానీ చాలా అరుదుగా వినాయకి అనే పేరు వినిపిస్తుంది.

వేల యేండ్లుగా..
గణేశుని స్త్రీ రూపం అయిన వినాయకి ప్రతిమలు వేల సంవత్సరాల నుంచే ప్రాచుర్యంలో ఉన్నాయి. రాజస్థాన్లో లభించిన క్రీస్తుపూర్వం నాటి ఒక వినాయకి టెర్రకోట ప్రతిమను ఇందుకు ఉదాహరణగా చెబుతూ ఉంటారు. వినాయకికి సంబంధించి ప్రత్యేక ఆలయాలు లేనప్పటికీ సుచీంద్రం, చెరియనాడ్ వంటి ప్రాచీన ఆలయాలలోని గోడల మీద వినాయకి శిల్పాలు మనకు కనిపిస్తాయి.

పురాణాలలో..
వినాయకి గురంచి జనబాహుళ్యంలో పెద్దగా ప్రచారం లేదు. కానీ పురాణాలలో మాత్రం ఈమె ప్రస్తావన కనిపిస్తుంది. స్కాంద, మత్స్య, వాయు, లింగ పురాణాలలో వినాయకి గురించి ఉందని అంటారు. కొన్ని కథల ప్రకారం వినాయకి తొమ్మిదిమంది మాతృకలలో ఒకరు. మరికొన్ని కథనాల ప్రకారం ఆమె 64మంది యోగినిలలో ఒకరు. వినాయకికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, స్పష్టమైన కథనం మాత్రం అంధకాసురుని వధ సందర్భంగా వినిపిస్తుంది.
అంధకాసురుని వధ
పరమేశ్వరుడు ఒకానొకప్పుడు లోకకంటకుడైన అంధకాసురుడు అనే రాక్షసుని వధించడానికి బయల్దేరాడు. కానీ అంధకాసురునికి ఒక చిత్రమైన వరం ఉంది. అదేమిటంటే… అతని రక్తం నేల మీద పడగానే ప్రతి ఒక్క రక్తపు బొట్టు నుంచి ఒకో అంధకాసురుడు ఉద్భవిస్తాడు. అలా అంధకాసురుని రక్తం నేల మీద పడకుండా చూడడానికి ప్రతీ ఒక్క దేవతా నుంచీ స్త్రీ స్వరూపాలు వెలికివచ్చాయట. అలా వినాయకుని నుంచి వెలికి వచ్చిన స్త్రీ తత్వమే వినాయకి అని ఒక కథ ప్రచారంలో ఉంది.

ఆరాధన
గజానని, గణేశని, విఘ్నేశ్వరి… ఇలా వినాయకికి వివిధ పేర్లు కనిపిస్తాయి. చాలా సందర్భాలలో ఆమెకూ వినాయకునికీ మధ్య స్పష్టమైన సంబంధం చెప్పలేదు. పరశు, గొడ్డలి, మోదకాలను ధరించిన వినాయకి రూపమే ప్రాచీన శిల్పాలలో కనిపిస్తుంది. వినాయకిని విఘ్నాలకు అధినేత్రిగా భావిస్తారు. స్త్రీ దేవతలకు అధికంగా ప్రాధాన్యతను ఇచ్చే తాంత్రిక ఆచారాలలో వినాయకి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రకృతిలోని పురుష తత్వం, స్త్రీ తత్వం ఉన్నట్లే… ప్రతి దేవతకీ తప్పకుండా స్త్రీ స్వరూపాన్ని ఆపాదించడం మన తత్వంలోనే ఉంది. ఎందుకంటే, ఈ రెండు గుణాలూ కలిస్తేనే పరిపూర్ణత అని మనకు తెలుసు.