కేరళలోని చాలా గుళ్లలో మనం ఏనుగులను చూడొచ్చు. వచ్చేపోయే వారికి దీవెనలిస్తూ ఆ ప్రాంగణంలో ఉంటాయి. అయితే అక్కడ ఇలా బంధించి బాధించడం కాకుండా వాటి స్థానంలో రోబో ఏనుగులను ప్రవేశ పెడుతున్నారు.
భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోనే కాదు, తమిళనాడు.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఏనుగులను ఆ గుడి ప్రాంగణంలో ఉంచుతుంటారు. వాటిని ఉత్సవాల్లో కూడా ఉపయోగిస్తుంటారు. అలా గుడిలో వచ్చే భక్తులకు దీవెనలు ఇస్తూ ఆ ఏనుగు ఆ ప్రాంగణంలోనే కన్నుమూస్తుంటాయి. ఈ ఆచారం ఆనాది కాలంగా వస్తున్నది. అయితే అలా ఏనుగులను బంధించడం సరికాదని రోబో ఏనుగును ప్రవేశ పెట్టారు.
నిజమైన జంతువు లాగే రోబో ఏనుగు దాని చెవులను ఆడిస్తుంది. దాని తోకను కదిలిస్తుంది. దాని తొండం ద్వారా నీటిని చల్లుతుంది. ఈ ఏనుగు 11 అడుగుల పొడవు, 800 కిలోగ్రాముల బరువు ఉంటుంది. అంతేకాదు.. ఒక వ్యక్తిని తన వీపుపై మోయగలదు. పెటా ఇండియా ద్వారా ఇరింజడప్పిల్లి శ్రీ కృష్ణ ఆలయానికి విరాళంగా ఇవ్వబడిందీ రోబోటిక్ ఏనుగు. మతపరమైన ఆచారాలలో జంతు హింస సమస్యను పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన ఒక చొరవలో భాగంగా ఈ ఏనుగును తయారు చేయించారు. వేడుకలకు ఉపయోగించే ఏనుగులు శారీరక, మానసిక ఒత్తిడికి గురవుతాయి. ఉత్సవాల సమయంలో మెరుస్తున్న లైట్లు, పెద్ద శబ్దాలు, జనసమూహాల కోలహాలం వల్ల జంతువులలో అనియంత్రిత ప్రతిచర్యలు ఏర్పడతాయి. దీని ఫలితంగా తరచుగా మానవ ప్రాణనష్టం జరుగుతుంది. అందుకే ఈ రోబోటిక్ ఏనుగు ప్రవేశం అనివార్యం అనిపించింది.

అంతరించిపోతున్న జాతి అయిన ఆసియా ఏనుగులు భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. పురాతన కాలంలో ఏనుగులు యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి. యుద్ధభూమిలో శక్తికి చిహ్నంగా పనిచేశాయి. హిందూ మతంలో జ్ఞానం, కొత్త ప్రారంభాలు, అడ్డంకులను తొలగించేందుకు వినాయకుడిని పూజిస్తారు. ఆయనకు ఏనుగు తల ఉండడం వల్ల కూడా గుళ్లలో ఈ ఏనుగులను ఉంచడం పవిత్రంగా భావిస్తారు. కానీ వాటిని మచ్చిక చేసుకోవడానికి వాటిని హింసించాల్సి ఉంటుందని మరచిపోతున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 2,700 బందీ ఏనుగులు ఉన్నట్లు నివేదించబడింది. దేశంలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ యానిమల్ రైట్స్ (CRAR) ఇటీవల కేరళ ముఖ్యమంత్రిని నిర్బంధంలో ఉన్న ఏనుగుల మరణాల రేటు ఆందోళనకరమైన పెరుగుదల గురించి హెచ్చరించింది. 2018 నుంచి 2023 మధ్య 138 ఏనుగులు చనిపోయాయని ఈ నివేదిక పేర్కొంది.