తొక్కే కదా అని తీసిపారేస్తాం. కానీ అదే తొక్కతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. నారింజ పండు తిన్న తర్వాత ఆ ఇక నుంచి తొక్కను పడేయకండి. అందాన్ని సంరక్షించే ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలో చెబుతాం ట్రై చేయండి.
నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. అందాన్ని పెంచే లక్షణాలు కూడా బోలెడు. యాంటీ ఆక్సిడెంట్ల ఉన్న ఈ తొక్కతో మరికొన్ని కలుపాల్సి ఉంటుంది. ఆ ఫేస్ ప్యాక్ లు ఎలా వేసుకోవాలో చూడండి. అయితే ముందుగా ఈ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. వీటిని ఒక గాలి చొరబడని కంటెయినర్ లో పెట్టుకోవాలి. కావాల్సినప్పుడు వీటిని వాడుకోవచ్చు.
కొబ్బరినూనెతో..
నారింజ పొడిలో పాలు, కొబ్బరి నూనె వేసి బాగా కలుపాలి. ఇది చర్మం ప్రకాశవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ ను వేసుకొని పావుగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
ఓట్స్ తో..
ఒక గిన్నెలో 2 టీస్పూన్ల నారింజ తొక్క పొడి, ఒక టీస్పూన్ ఓట్మీల్, చిటికెడు బేకింగ్ సోడా వేసి కలుపాలి. ముఖానికి, మెడకు రాసి ఆరనివ్వాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయాలి. మొటిమల నివారణకు ఈ ప్యాక్ ఉపయోగించవచ్చు. కావాలనుకుంటే దీనికి చిటికెడు పసుపు కూడా కలుపుకోవచ్చు.
చందనం..
ఆరెంజ్ పౌడర్ లో, ఒక టీస్పూన్ చందనం, ఒక టీస్పూన్ వాల్ నట్ పౌడర్ వేసి కలుపాలి. ఆ తర్వాత 2 నుంచి 3 చుక్కల నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి కలుపాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి రాసి ఆరేంత వరకు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో కడిగితే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
ముల్తానీ మట్టి..
జిడ్డు చర్మానికి ఈ ఫేస్ ప్యాక్ సరిగ్గా సరిపోతుంది. ఒక టీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, ఒక టీస్పూన్ ముల్తానీ మట్టి, కొద్దిగా రోజ్ వాటర్ వేసి మెత్తని పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి రాయాలి. ఆ తర్వాత కడిగేయాలి. దీనివల్ల మృతకణాలు తొలిగిపోతాయి.
పాలతో..
ఆరెంజ్ పీల్ పౌడర్ లో కొన్ని పాలు పోసి కలుపాలి. దీంట్లో కొన్ని చుక్కలు కొబ్బరి నూనె కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పొడిచర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. అద్భుతమైన మెరుపు మీ సొంతమవుతుంది.