ట్యూలిప్స్ కాలం వచ్చేసింది. విదేశాల్లో వీటి అందం చూడడానికి రెండు కళ్లూ చాలవు. అందుకే అంత అందమైన పువ్వులకు అతిలోక సుందరిలాంటి నటి పేరు పెట్టారు. అది ఎక్కడా? ఏ హీరోయిన్ పేరు తెలుసా?
2005లో.. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు మీద నెదర్లాండ్స్లో అరుదైన ట్యూలిప్స్కి ఆ పేరు పెట్టారు. దీనివల్ల ఆమె అందానికి ఒక ప్రత్యేకమైన నివాళి అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ ప్రఖ్యాత క్యూకెన్హాఫ్ గార్డెన్స్లో కనిపించే ఈ ట్యూలిప్లను ఐశ్వర్య అందం, ప్రపంచ ప్రభావానికి ఒక వేడుకగా పరిచయం చేశారు. డచ్ ప్రభుత్వం ఆమెను ఒక ఐకాన్గా గుర్తించింది. ఆ శక్తివంతమైన పువ్వు ఆమె చక్కదనాన్ని సూచిస్తుంది.
అంతర్జాతీయ వేదికపై తన అద్భుతమైన ఉనికికి పేరుగాంచిన ఐశ్వర్య ఈ గుర్తింపుతో ఎంతో గౌరవించబడింది. కామన్వెల్త్ యూనియన్ వెబ్సైట్ ప్రకారం.. ఆ క్షణం గురించి మాట్లాడుతూ ఆమె తన గర్వాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు.. “ప్రపంచం ఒక భారతీయురాలిని గుర్తించినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది” అని పేర్కొంది.

గ్లోబల్ ఐకాన్..
అంతర్జాతీయంగా ఐశ్వర్య రాయ్ ప్రభావం సినిమాలకు అతీతంగా ఉంది. ఆమె తరచుగా ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఒక ప్రతిష్టాత్మక విదేశీ పత్రిక టాప్ 100 అత్యంత ఆకర్షణీయమైన మహిళల జాబితాలో చోటు సంపాదించింది.
2003లో ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసిన మొదటి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. ఇది భారతీయ సినిమాకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అప్పటి నుంచి ప్రతీ యేడు ఆమె కేన్స్లో ఉండడం జరుగుతున్నది.
అమితాబ్ బచ్చన్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్ లండన్లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసుకున్న రెండవ భారతీయ నటిగా ఐశ్వర్య ఘనత సాధించింది. చలనచిత్ర పరిశ్రమపై ఆమె ప్రభావం, ఆమె మానవతావాద కార్యకలాపాలు, అంతర్జాతీయంగా ఆమెను ఒక ఉన్నతస్థానంలో నిలబెట్టాయి.
ఐశ్వర్యరాయ్ పొన్నియన్ సెల్వన్ 2 విడుదల తర్వాత ఇప్పటివరకు ఇంకా ఏ సినిమా చేయలేదు. ఆ ప్రపంచ సుందరి మళ్లీ సినిమాల్లోకి వస్తే చూడాలని ఆమె అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.