పాక శాస్త్రంతో ఇంటినే కాదు.. మహిళా సాధికారతనూ సాధించొచ్చని చెబుతున్నారీ మేనత్తాకోడళ్లు. ది మండువా పేరుతో ఆంధ్రపాక రుచులను ప్రపంచం నలుమూలాల రుచిచూపిస్తున్నారు. వారే.. నేహా అల్లూరి, ఉషా సర్వరాయులు. వారి ప్రయాణం గురించే ఈ కథనం..

గ్రామీణ భారతదేశంలో.. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నదేవరపేటలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏం లేదు. ఇదంతా 31 యేండ్ల నేహా అల్లూరి, 70యేండ్ల ఉషా సర్వరాయులు వచ్చేంతవరకు మాత్రమే. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మండువా ప్రాజెక్ట్ తో పచ్చళ్లు, పొడులు తయారు చేసి దేశం నలుమూలల అమ్ముతూ లాభాల బాట పట్టిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 50మందికి పైగా ఆర్థికంగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు.
మూలాల నుంచే..

ఎక్కడికి వెళ్లినా మూలాలను మరువకూడదని చెప్పారు పెద్దలు. అదే నేహా బాగా వంట పట్టించుకుంది. మాడిసన్లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో పట్టభద్రురాలైంది. అంటే ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 13వేల కిలోమీటర్ల దూరంలో చాలాకాలం గడిపింది. విదేశాల్లో ఉన్నా తన మూలలను ఎక్కడా మరచిపోలేదు. కోవిడ్ -19 సమయం ఆమెను సంప్రదాయ వంటకాల వైపు, అమ్మమ్మ చేసే గుడ్డుకూర బెల్లం ఆమెను మాడిసన్ లో కాకుండా అన్నదేవరపేటకు దారి ఎటు అని అడుగులు వేసేలా చేసింది.
మండువా పుట్టుక..
ఉష ఉండేది అన్నదేవరపేటలో. అక్కడ ఊరగాయలు, పొడులు తయారు చేసే ఆడవాళ్లతో పరిచయం ఉంది. కానీ వారు స్థిరమైన ఆదాయాన్ని పొందడం లేదని గమనించారు. ఇదే విషయాన్ని తన మేనకోడలు అయిన నేహాతో పంచుకున్నారు. ఆ ఆడవాళ్లకు ఏదైనా చేయూతనివ్వాలనే ఆలోచనలో నుంచి పుట్టినదే మండువా. ప్రాంగణంతో కూడిన ఇంటినే మండువా అని పిలిచేవాళ్లు. అక్కడికి వచ్చి ఆడవాళ్లంతో ముచ్చట్లతో కాలక్షేపం చేసేవాళ్లు. అంతేకాదు.. అక్కడే పచ్చళ్లు, ఇతర పిండివంటకాలు తయారుచేసుకునేవారు. అందుకే అదే పేరును ఖరారు చేశారీ అత్తాకోడళ్లు. అలా 2020 లో మండువా మొదలైంది.

కమ్యూనిటీ స్థలంగా..
2023 వరకు ఈ అత్తాకోడళ్లు అనధికార వంటగది సెటప్ తో నడిపించేశారు. జనవరి 2024లో,ఈ ప్రాజెక్ట్ సమిష్టి ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీగా మారింది. అంటే.. మహిళలు కలిసి వంట చేసుకోగలిగే కమ్యూనిటీ స్థలంగానే కాకుండా.. సహకార సంఘంగా కూడా మండువా పనిచేస్తుంది, మహిళలు ఇతర కంపెనీలకు ఉత్పత్తులను తయారు చేయడానికి దీనిని ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రాజెక్ట్ ప్రారంభం నుండి దానితో ఉన్న అనితా కనూరి, తయారీ ప్రక్రియను నిర్వహిండంలో, కొత్త సెటప్లో సమాజ భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది.
స్వయం సమృద్ధి వైపు..
మండువా ప్రాజెక్ట్ లో.. 25 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ మహిళలు పని చేస్తున్నారు. వారి సామర్థ్యం ఆధారంగా వారి పనులను విభజించారు. వారు చేసే పనిని బట్టి జీతాన్నిఇవ్వడం జరుగుతుందని నేహా చెబుతున్నది. రోజుకు దాదాపు 1,500 నుండి 2,000 కిలోల వరకు అన్ని ఉత్పత్తులను తయారు చేస్తారు. వాటిని ప్రధానంగా వారి వెబ్సైట్, కొన్ని ఆఫ్లైన్ ప్రెజెన్స్ల ద్వారా అమ్ముతున్నారు. ఇందులో మామిడి ఊరగాయలు బెస్ట్ సెల్లర్గా ఉన్నది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, కొచ్చి మరియు ఇతర నగరాల నుండి వచ్చిన కస్టమర్లతో, మాండువా ప్రాజెక్ట్ ఇప్పుడు ఏడు రకాల ఊరగాయలు, ఎనిమిది పొడులు, ఫ్రైయంలు, నామ్కీన్లను తయారుచేస్తున్నారు. ప్రతి నెలా రూ. 3 నుండి 5 లక్షల లాభం పొందుతున్నారు.