సౌదీలో ఆడవాళ్లు బయటకు అన్ని రంగాల్లో అడుగుపెట్టడం ఈ మధ్యే మొదలైంది. అలాంటిది మక్కా మసీదులో ఫొటోలు తీయడానికి ఒక మహిళను ఏర్పాటు చేశారు. నాదా.. అడ్డంకులను ఎదుర్కొని ఒక కొత్త చరిత్రకు నాంది పలికినట్టే!
ఈ రంజాన్ మాసం సౌదీ మహిళలకు ఫోటోగ్రఫీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఎందుకంటే మక్కా గ్రాండ్ మసీదు లోపల ఫొటోలు తీయడానికి అధికారికంగా లైసెన్స్ పొందిన మొదటి సౌదీ మహిళ నాదా అల్-ఘమ్డిగా చరిత్ర సృష్టించింది. ఈమె ఇప్పుడు మసీదుల్లో ఫొటోలు తీసే మొదటి సౌదీ మహిళ.
ఇస్లాం పవిత్ర స్థలంలో ఆరాధకులు గుమిగూడినప్పుడు, అల్-ఘమ్డి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తన ఫొటోల్లో బంధిస్తుంది. ముఖ్యంగా ఈ పవిత్ర మాసంలో పవిత్ర స్థలం గొప్పతనాన్ని చూపించడం అందరి కల. అలాంటిది ఒక మహిళకు అవకాశం రావడం నిజంగా ఒక గొప్ప అవకాశమే. సౌదీ అధికారులు 2025 రంజాన్ సందర్భంగా అనుమతి లేకుండా మసీదు అల్-హరామ్, మసీదు అన్-నబావి లోపల చిత్రీకరణ, ఫొటోగ్రఫీపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అందరూ తీయడం కంటే ఒకరే దానిపట్ల నిబద్ధతో పని చేస్తే బాగుంటుందని భావించారు. అందుకే నాదాని సెలెక్ట్ చేశారు. దానివల్ల అక్కడికి వచ్చినవాళ్లు దేవుడి పట్ల ఆరాధన, భక్తి భావంతో ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా వారి నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానాలు, పరికరాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.