తీన్మార్ న్యూస్తో సావిత్రిగా ఫేమస్ అయి.. ఆ తర్వాత బిగ్బాస్తో జ్యోతక్కగా మారిన శివజ్యోతి ఈ రోజు ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నది.
కెరీర్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన న్యూస్ యాంకర్ శివజ్యోతి. ఈ పేరుతో కంటే సావిత్రక్కగా ఈవిడ అందరికీ సుపరిచితురాలు. ఒక పల్లెటూరి అమ్మాయిలా.. తెలంగాణ యాసతో అందరినీ తన వార్తలతో, మాటలతో కట్టిపడేసింది. బిగ్బాస్తో ఆమె అమాయకత్వం.. మంచితనం అందరికీ తెలిసింది.
చిన్న వయసులోనే ప్రేమ పెండ్లి చేసుకుంది జ్యోతక్క. ఇప్పటికి పెండ్లయి పదేళ్లయింది. పిల్లలు లేరని ఇన్నిసంవత్సరాలు ఆమె చాలా బాధపడింది. ఆ బాధ అంతా పోయినట్లు గతేడాది ఆమె తన ప్రెగ్నీన్సీ విషయం చెప్పి చాలా సంతోషపడింది. ఈ తొమ్మిది నెలల కాలం ఆమె సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నది. 24గంటల ముందు కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చింది శివజ్యోతి.

ఆ పోస్ట్లో..
ఈ 9నెలల ప్రెగ్నెన్సీ జర్నీ చాలా సంతోషంగా సాగింది. ఈ జర్నీలో ఏ ఒక్కరోజూ నేను టెన్షన్ పడలేదు. అందరిలాగే కొంత అసౌకర్యం ఉంది. ఈ జర్నీలో అదంతా సహజమే కదా! అది కూడా నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నాన్న.. నేను నీ రాకకై ఎంతో ఎదురుచూస్తున్నాం. నీ తల్లిదండ్రులుగా మమల్ని ఎంపిక చేసుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నాం. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాం. నువ్వు మా జీవితంలోకి రావడం ఒక అద్భుతంగా భావిస్తున్నాం. మా హృదయంలోకి.. మా చేతుల్లోకి తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలాగే సురక్షితంగా డెలివరీ కావాలని ఆశిస్తున్నా. ఇంకా నీకోసం ఎదురుచూడలేను.. త్వరగా వచ్చేయ్ బేబీ..
నిన్ననే ఇంత ఎమోషనల్గా పోస్ట్ పెట్టిన శివజ్యోతి ఈరోజు ఉదయమే అమ్మాయికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. తన మనసులాగే.. స్వచ్ఛంగా ఎప్పడూ తల్లీబిడ్డా ఇద్దరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ ఆశిస్తున్నారు.
