చీనాబ్ వంతెనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఎంతోమంది శ్రమ దాగి ఉంది. అందులో మన తెలుగు తేజం మాధవీలత హస్తం కూడా ఉంది. 17 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం అహోరాత్రులు కష్టపడింది.
భారత ఇంజనీర్లు అద్భుతమైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే ఎత్తయిన వంపు వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ విజయానికి అనేకమంది కారణమైనప్పటికీ.. దాని స్థిరత్వానికి సహకారం అందించింది తెనాలికి చెందిన జి. మాధవీలత. ఈమె బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుంచి ప్రొఫెసర్. రాక్ ఇంజనీరింగ్లో ఆమె నైపుణ్యం 17 సంవత్సరాలు ఈ వంతెన నిర్మాణంలో ఎంతగానో ఉపయోగపడింది. వంతెన కాంట్రాక్టర్ అయిన ఆఫ్కాన్స్తో కలిసి నిర్మాణం ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో, టెర్రియన్ వల్ల కలిగే అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని పనిచేశారు.
ఎవరీమె..?
మాధవీలత ప్రస్తుతం IIScలో HAG ప్రొఫెసర్గా ఉన్నారు. ఆమె 1992లో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బి.టెక్ పూర్తి చేసింది. అక్కడ ఆమె డిస్టింక్షన్తో ఫస్ట్ క్లాస్ సాధించింది. ఆ తర్వాత ఆమె వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్తో ఎం.టెక్ విద్యార్థిగా బంగారు పతకాన్ని పొందింది. ఇంకా లత 2000లో ఐఐటీ-మద్రాస్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పూర్తి చేసింది. ఆమె సంవత్సరాలుగా అనేక అవార్డులను అందుకుంది. వాటిలో 2021లో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ ద్వారా ఉత్తమ మహిళా జియోటెక్నికల్ పరిశోధకురాలు అవార్డు కూడా ఉంది. 2022లో ఆమె స్టీమ్ ఆఫ్ ఇండియాలో టాప్ 75 మహిళలలో ఒకరిగా కూడా ఎంపికయ్యారు.

ప్రాజెక్ట్లో పాత్ర..
ప్రతికూల స్థలాకృతి, వాతావరణ పరిస్థితులు, మారుమూల స్థానం కారణంగా ఈ వంతెన చాలా సవాలుతో కూడిన ప్రాజెక్ట్. లతా బృందం అడ్డంకులను అధిగమించడానికి “డిజైన్-యాజ్-యు-గో విధానం”ని అవలంబించింది. ప్రారంభ సర్వేలలో స్పష్టంగా కనిపించని విరిగిన రాళ్ళు, దాచిన కుహరాలు, వివిధ రాతి లక్షణాలు వంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వారు నిజ సమయంలో ఆవిష్కరణలు చేశారు. నిర్మాణ సమయంలో వారు కనుగొన్న వాస్తవ రాతి ద్రవ్యరాశి పరిస్థితుల చుట్టూ పనిచేయడానికి బృందం సంక్లిష్టమైన గణనలు, డిజైన్ మార్పులను చేసింది. స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి సలహాలు ఇచ్చింది లత. ఆమె ఇటీవల ఇండియన్ జియోటెక్నికల్ జర్నల్ మహిళల ప్రత్యేక సంచికలో “డిజైన్ యాజ్ యు గో: ది కేస్ స్టడీ ఆఫ్ చీనాబ్ రైల్వే బ్రిడ్జి” అనే శీర్షికతో ఒక పత్రాన్ని ప్రచురించింది. వంతెన రూపకల్పన నిరంతరం ఎలా అభివృద్ధి చెందిందో ఈ పత్రం వివరిస్తుంది.
వంతెన గురించి..
“ఇటీవలి చరిత్రలో భారతదేశంలో ఏ రైల్వే ప్రాజెక్ట్ ఎదుర్కొన్న అతిపెద్ద సివిల్-ఇంజనీరింగ్ సవాలు”గా ప్రభుత్వం అభివర్ణించిన చీనాబ్ వంతెనను రూ. 1,486 కోట్ల వ్యయంతో నిర్మించారు. 359 మీటర్ల వంతెన ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు పొడవుగా ఉంది. ఇది కాశ్మీర్ లోయలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉంది.
2005లో ప్రణాళిక దశల నుంచి 2022లో ట్రయల్స్ పూర్తయ్యే వరకు మాధవి లత 17 సంవత్సరాలు నిబద్ధతతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. చీనాబ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైనదిగా ఉండటమే కాకుండా, కఠినమైన హిమాలయ వాతావరణాన్ని సుమారు 120 సంవత్సరాల పాటు తట్టుకునేంత దృఢంగా ఉండేలా నిర్మాణం జరిగింది.