పానీపూరీ.. ఈ పేరు చెప్పగానే అందరి నోట్లో నీళ్లురూతుంటాయి. ‘భయ్యా తోడా ప్యాస్ దాలో’ అంటూ హిందీ రాని వాళ్లు సైతం హిందీ మాట్లాడేలా చేసింది ఆ పానీపూరీ బండే. కానీ ఆ పానీపూరీ మూలాలేంటో మీకు తెలుసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదా?
ఆలుగడ్డ, బఠాణీలతో వేడి వేడి కూర పెనం మీద కాలుతుంటుంది. పక్కన బిందెలో చింతపండు, పుదీనా.. ఇతరత్రాలతో చేసిన పానీ ఉంటుంది. అప్పుడు చిన్న పూరీ తీసుకొని వేడి కూరని కూరి దాన్ని ఆ రసంలో ముంచి ఒక ప్లేట్లో లేదా చిన్న డొప్పలాంటి గిన్నెలో వేసి ఇస్తాడు పానీపూరీ బండివాడు. ఈ ప్రాసెస్ కంటే ముందే కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను సైతం మన చిన్న డొప్పలో వేస్తాడు. ఇదంతా కలిపి ఒక్కసారి నోట్లో వేసుకుంటే స్వర్గం దిగి వచ్చిందన్నంత తృప్తిగా ఉంటుంది తిన్నవారికి. కేవలం భారతదేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం దీని హవా మామూలుగా ఉండదు. మరి ఇంతటి ఇష్టమైన పదార్థం మూలాలు తెలుసుకోకపోతే ఎలా? అందుకే ఆ విశేషాల సమాహారం మీకోసం..

పానీపూరీ చరిత్ర..
చారిత్రాత్మకంగా చెప్పాలంటే.. ఫుల్కి అనేది పానీపూరీకి పూర్వగామి అని నమ్ముతారు. ఇది మొదట పురాతన భారతదేశంలోని 16 మహాజనపదాలలో ఒకటైన మగధలో ఉద్భవించింది. అయితే ఈ ఆనందాన్ని కనిపెట్టిన పాక మేధావికి చరిత్ర పుటలలో తగిన గుర్తింపు లభించలేదు. పానీపూరీ ఉత్తరప్రదేశ్, బీహార్ చుట్టూ సుమారు 100-125 సంవత్సరాల క్రితం ఉద్భవించిందని, ఇది రాజ్-కచోరి రూపాంతరం అని కొందరు నమ్ముతారు. ఎవరో ఒక చిన్న ‘పూరీ’ తయారు చేసి ఇతర రుచికరమైన వంటకాల మధ్య తిన్నారని కథలుగా చెబుతుంటారు.
పురాణకథనం..
ఒకసారి కుంతి తన కోడలు ద్రౌపది పాండవుల వనవాస సమయంలో అందుబాటులో ఉన్న కొరత వనరులతో వారిని బాగా చూసుకోగలదా అని పరీక్షించాలనుకుంది. ముఖ్యంగా ద్రౌపది తన 5 గురు భర్తలలో ఎవరినైనా ఆదరిస్తుందా లేదా అందరి పట్ల న్యాయంగా ఉంటుందా అని కూడా ఆమె తనిఖీ చేయాలనుకుంది. కుంతి ఈ సవాలును ఎందుకు విసిరిందనేది ధృవీకరించబడలేదు. కొన్ని పురాణాలు ద్రౌపదికి కొత్తగా వివాహం అయినప్పుడు ఇది ఒక పరీక్ష అని చెబుతాయి. మరికొన్ని పురాణాలు ద్రౌపది, పాండవులు 13 సంవత్సరాల సుదీర్ఘ వనవాసానికి (పాచికల ఆటలో తమ రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత) బయలుదేరే ముందు ఇది ఒక పరీక్ష అని చెబుతున్నాయి.

కుంతి ద్రౌపదికి మిగిలిపోయిన బంగాళాదుంప సబ్జీ (కూర), కొంత గోధుమ పిండిని ఇచ్చి ఒక చిన్న చపాతీ తయారు చేసి పాండవులు ఆకలితో అలమటించకుండా చూసుకోవాలని చెప్పింది. అప్పుడే ద్రౌపది తెలివిగా ఈ కళాఖండాన్ని తయారు చేసింది. కుంతి దాని ఫలితం ( ద్రౌపది తన భర్తల పట్ల నిష్పాక్షికత) చూసి ఆనందించి ఈ వంటకాన్ని అమరత్వం ఉండాలని దీవించిందట. అప్పటి నుంచి ఈ వంటకం చాలా ప్రదేశాలకు ప్రయాణించింది. వివిధ రూపాల్లో వచ్చింది. వివిధ పేర్లతో పిలువబడింది. అయినప్పటికీ ప్రతి రూపంలోనూ ఆనందించబడింది, ప్రేమించబడింది.
రీగల్ గొల్గప్ప
ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో ఈ చిరుతిండిని గొల్గప్ప అని పిలుస్తారు. క్రిస్పీ పూరీలలో బంగాళాదుంప, చిక్పా, చట్నీల పరిపూర్ణ మిశ్రమంతో కూడిన ఫిల్లింగ్ ఉంటుంది. దీనిని కారంగా పుదీనా నీటితో కలిపి వడ్డిస్తారు.
పుచ్కా
పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్లలో పుచ్కా ప్రసిద్ధి చెందింది. ఈ చిరుతిండిలో గోధుమపిండితో తయారు చేసిన పూరీ షెల్స్ ఉంటాయి. ఉడికించిన చిక్పీస్, మెత్తని బంగాళాదుంపల మిశ్రమం ఫిల్లింగ్, గోంధోరాజ్ నిమ్మరసం, రుచికరమైన చింతపండు నీటితో నింపి ఇస్తారు.

మహారాష్ట్ర ట్విస్ట్
మహారాష్ట్ర, గుజరాత్లలో.. గొల్గప్పాలకు అదనపు ట్విస్ట్ ఉంది. ఇది ఫిల్లింగ్లో తెల్ల బఠానీలు ఉపయోగించడం, ఇది చింతపండు, కారం నీటితో మిళితం చేసి ఇస్తారు.
పానీ కే బటాషే
ఉత్తరప్రదేశ్లో, ముఖ్యంగా కాన్పూర్, లక్నోలో.. దీనిని పానీ పూరి లేదా పానీ కే బటాషే అని పిలుస్తారు. ఫిల్లింగ్లో ఉడికించిన తెల్ల బఠానీలు, బంగాళాదుంపలు ఉంటాయి. వీరు తయారుచేసే నీటిలో కొంత తియ్యదనం తగులుతుంది. యూపీలోని కొన్ని ప్రాంతాలలో ఐదు రకాల నీటితో ‘పాంచ్ స్వాద్ కే బటాషే’ కూడా ఉంటుంది.
గప్ చుప్
ఒడిశా, హైదరాబాద్లలో.. పానీ పూరీలను తరచుగా గప్ చుప్ అని పిలుస్తారు. పూరీలు మొత్తం గోధుమ పిండి సెమోలినా మిశ్రమంగా ఉంటాయి. ఫిల్లింగ్లో ఉడికించిన బంగాళాదుంపలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉంటాయి.