ఆపరేషన్ సిందూర్.. కల్నల్ సోఫియా ఖురేషి ప్రపంచమంతా ఆమె గురించి మాట్లాడుకుంటున్నది. కానీ ఆమెకు ఒక కవల సోదరి ఉంది. ఆమె ఒక రైఫిల్ షూటర్, మోడల్గా కూడా ఆమె విజయాల జాబితాలో ఉన్నాయి. మరి ఆమె గురించి తెలుసుకోకపోతే ఎలా..?
ఆపరేషన్ సిందూర్లో భాగంగా మే 7న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం దాడి చేసిన ఆపరేషన్ గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మొదటి బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ సందర్భంగా కల్నల్ సోఫియా ఖురైషి గురించి ప్రపంచానికి తెలిసింది. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ జరిగింది.

సోదరి గురించి..
డాక్టర్ షైనా సున్సారా మాజీ ఆర్మీ క్యాడెట్. జాతీయ స్థాయి రైఫిల్ షూటర్. ఇందులో ఆమెకు పెద్ద విజయాల జాబితా ఉంది. షైనా మొదటగా తన సోదరి సోఫియాతో కలిసి సైన్యంలో చేరాలని కలలు కన్నానని చెప్పింది. రైఫిల్ షూటింగ్లో భారత రాష్ట్రపతి నుంచి ఆమెకు బంగారు పతకం లభించింది. ఆ తర్వాత ఆమె అనుకోని రీతిలో మోడలింగ్ వైపు వెళ్లింది. ఆమెకు మిస్ గుజరాత్ కిరీటం సొంతం చేసుకుంది. ఆ తర్వాత మిస్ ఇండియా ఎర్త్ 2017, మిస్ యునైటెడ్ నేషన్స్ 2018 కూడా వచ్చాయి.
ఇతర విజయాలు..
2018లో షైనా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది. ఈ అవార్డు ఫ్యాషన్, ఇతర ప్రదర్శనలలో ఆమె చేసిన కృషికి మాత్రమే కాదు, గుజరాత్ అంతటా లక్ష చెట్లను నాటిన ఆమె హరిత చొరవకు కూడా లభించింది. సోఫియా అంటే షైనాకి వల్లమాలిన ప్రేమ. అందుకే సిందూర్ ఆపరేషన్ తర్వాత తన కవల సోదరి సోఫియా గురించి .. ఝాన్సీరాణి మళ్లీ పుట్టినట్టు అనిపిస్తుందని ప్రస్తావించింది. మొత్తానికి ఒకరు దేశ సేవ చేస్తూ, మరొకరు ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్నారు.