ఏ సీజన్ అయినా సరే.. సాయంత్రం అయితే చాయ్ సమోసా తినాల్సిందే చాలామందికి. అయితే ఈ సమోసా చరిత్ర గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా? అసలు దీన్ని మొదట భారతీయులు తయారు చేయలేదని తెలుసా? అంతేకాదండోయ్.. ఒక ప్రాంతంలో వీటిని బ్యాన్ చేశారు.
భారతదేశంలో సమోసాను చాలా ఇష్టంగా తింటారు. సమోసాను టీతో కలిపి ఆస్వాదించడం అద్భుతంగా ఉంటుంది. కానీ దీనిని మొదటిసారిగా భారతీయులు తయారు చేయలేదు. ఇది వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చింది. కాబట్టి మీకు ఇష్టమైన సాయంత్రం స్నాక్ సమోసా చరిత్రను తెలుసుకోండి.
ఒకప్పుడు సమోసా లేకుండా పుట్టినరోజు వేడుక చేసుకోవడం అరుదు. ఇంటికి అతిథులు వస్తే గుర్తుకు వచ్చే మొదటి ఆలోచన ఏమిటంటే.. సమీపంలోని దుకాణం నుంచి సమోసా తీసుకురావడం. ఎందుకంటే సమోసా అన్ని వయసుల వారికి ఇష్టమైనది. పిల్లలు లేదా పెద్దలు అయినా అందరూ సమోసాను చాలా ఇష్టంగా తింటారు. పైగా ఈ క్రిస్పీ, స్పైసీ, రుచికరమైన సమోసా ప్రతిచోటా సులభంగా లభిస్తుంది. అందరికీ ఇష్టమైన సమోసా చాలా ఆసక్తికరమైన ప్రయాణాన్ని కలిగి ఉంటుంది. నిజానికి సమోసా భారతదేశానికి పురాతన ఇరాన్ సామ్రాజ్యం నుంచి వచ్చింది. దీనిని పర్షియన్ భాషలో సంబుసాగ్ అని పిలిచేవారు. తరువాత దీనికి సమోసా అని పేరు పెట్టారు.

సమోసా చరిత్ర..
సమోసా గురించి మొదట 11వ శతాబ్దపు ఇరానియన్ చరిత్రకారుడు అబుల్ ఫజల్ బైహకి తన పుస్తకం తారిఖ్-ఎ-బైహకిలో ప్రస్తావించారు. ఘజ్నావిడ్ సామ్రాజ్య రాజ సభలో వడ్డించిన ఈ వంటకం గురించి ఆయన ప్రస్తావించారు. ఇది ముక్కలు చేసిన మాంసం, గింజలతో నిండి ఉండేది. పదవ శతాబ్దంలో మధ్యప్రాచ్య ఆసియాలో సమోసా తయారు చేయబడింది.
భారతదేశానికి ఎలా..?
13వ-14వ శతాబ్దంలో మధ్యప్రాచ్య ఆసియా నుంచి వ్యాపారులు, ముస్లిం దండయాత్రదారులు భారతదేశానికి వచ్చారు. ఇక ఇక్కడి నుంచి భారతదేశంలో సమోసా కథ ప్రారంభమైందని చెబుతారు. అమీర్ ఖుస్రో, ఇబ్న్ బటుటా వంటి రచయితలు తమ రచనలలో సమోసా గురించి కూడా ప్రస్తావించారు.
ఢిల్లీ సుల్తానేట్ కు చెందిన అబుల్ ఫజల్ కూడా అయిన్-ఎ-అక్బరిలో రాజ వంటకాల జాబితాలో సమోసా పేరును ప్రస్తావించాడు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు ఆలుగడ్డలను భారతదేశానికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆలూ సమోసా తయారు చేయడం ప్రారంభించారు. భారతదేశానికి వచ్చిన తర్వాత భారతీయులు తమదైన రీతిలో సమోసా తయారీని మార్చేశారు. ఆలుగడ్డ, ఉప్పు, బఠాణీ.. ఇలా దానిలో నింపడానికి ఉపయోగించడం ప్రారంభించారు. నేడు ఇది భారతదేశానికి ఇష్టమైన సాయంత్రం చిరుతిండిగా మారింది. సమోసా కథ ఎంత ఆసక్తికరంగా ఉన్నా భారతీయులు దానిని అదే ప్రేమ, గౌరవంతో స్వీకరించారు.

సమోసా బ్యాన్ ఇక్కడ..
ఆఫ్రికన్ దేశం సోమాలియాలోని తీవ్రవాద ఇస్లాం యోధులు సమోసాలు చాలా ‘పాశ్చాత్య’ స్నాక్స్ అని తీర్పు ఇచ్చి వాటిని నిషేధించారు. అల్-షబాబ్ అనేది ఒక ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గ్రూప్. ఇది కొనసాగుతున్న సోమాలియా అంతర్యుద్ధంలో చురుకుగా పాల్గొంటుంది. సోమాలియాలోని అల్ ఖైదాతో సంబంధాలున్న ఈ గ్రూప్ దేశంలోని చాలా భాగాన్ని నియంత్రిస్తుంది. 2011లో సమోసాలపై నిషేధాన్ని తీసుకువచ్చింది.
ఉగ్రవాద గ్రూపు అధికారికంగా నిషేధానికి ఎటువంటి వివరణ ఇవ్వనప్పటికీ సమోసాల త్రిభుజాకార ఆకారం క్రైస్తవ గుర్తును పోలి ఉండటం వల్ల వారిని కలవరపెట్టిందని మీడియా తరువాత నివేదించింది. స్థానికంగా వీటిని అక్కడ సంబుసాలు అని పిలుస్తారు. వాటిని తిన్నా, తయారు చేస్తూ పట్టుబడిన ఎవరైనా వెంటనే శిక్షించబడతారు.