కోయంబత్తూరుకు చెందిన 68 ఏళ్ల రాణి అనే మహిళ పాఠశాల మానేసిన ఐదు దశాబ్దాలయింది. కానీ ఇప్పుడు ప్రైవేట్ అభ్యర్థిగా 12వ తరగతి బోర్డు పరీక్ష రాసి ఉత్తీర్ణురాలైంది. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నది.
కాలిక్కనైకెన్పాళయం నివాసి అయిన రాణి ఎన్ టి 12వ తరగతిలో 600 మార్కులకుగానూ 346 మార్కులు సాధించింది. వాటిలో తమిళంలో 89, ఇంగ్లీషులో 50, ఆర్థిక శాస్త్రంలో 48 మార్కులు పొందింది. ఆమె ఎటువంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే తనే సొంతంగా చదువుకొని పాసయింది.
తేని జిల్లాలోని బోడినాయకనూర్కు చెందిన రాణి 1972లో 10వ తరగతి పూర్తి చేసింది. “అప్పట్లో మా గ్రామంలో ఉన్నత చదువులకు అవకాశాలు లేవు. వివాహం తర్వాత నేను చెన్నైకి, తరువాత కోయంబత్తూరుకు వెళ్లాను. కుటుంబ బాధ్యతలు నా చదువును కొనసాగించకుండా నన్ను ఆపాయి” అని ఆమె తెలిపింది.
2020లో తన భర్త మరణం తర్వాత తను చదువుకోవాలనే ఆలోచన చేసింది. “నా పిల్లలు స్థిరపడటంతో, పెద్ద కుటుంబ కట్టుబాట్లు లేకపోవడంతో నాకోసం ఏదైనా చేయాలనుకున్నాను. నేను పాఠ్యపుస్తకాలు కొని 11వ తరగతి పరీక్ష కోసం ప్రతిరోజూ చదువుకున్నాను” అని ఆమె చెప్పింది.
తన మొదటి ప్రయత్నంలోనే 11వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, ఆమె ఈ సంవత్సరం 12వ తరగతి బోర్డుకు ప్రైవేట్ అభ్యర్థిగా నమోదు చేసుకుంది. “నేను సైన్స్ స్ట్రీమ్ తీసుకోవాలనుకున్నాను. కానీ అది అందుబాటులో లేదు. అందుకే నేను ఆర్ట్స్ను ఎంచుకున్నాను” అని ఆమె చెప్పింది. యోగా, కలరి ప్రాక్టీస్ చేసే రాణి ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటుంది. “ఈ వయసులో నాకు అడ్మిషన్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రయత్నించాలనుకుంటున్నాను”అని రాణి అంటున్నది. మరొకసారి చదువుకోవడానికి వయోపరిమితి లేదని ఆమె నిరూపించింది.