దంతాలను బట్టే మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. కాబట్టి దంతాల సంరక్షణ కచ్చితంగా చేయాల్సిందే! కానీ ఎంత చేసినా చిగుళ్ల నుంచి రక్తస్రావం, నోటి దుర్వాసన బాధిస్తుంటాయి. అలా కాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు..
ఎంత చేసినా కొన్నిసార్లు పళ్ల నుంచి రక్తం కారుతుంటుంది. ఏం తిన్నా కూడా నోటి నుంచి ఒక రకమైన దుర్వాసన వేధిస్తుంటుంది. వీటిని తగ్గించేందుకు కచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే దంతాలు అందంగా మెరిసిపోతాయి.
- పళ్లను రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాల్సిందే. తొందరగా అవ్వాలని కొందరు గబాగబా కడిగేస్తుంటారు. అలాకాకుండా సరైన బ్రషింగ్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకోవాలి. రౌండ్ గా కనీసం రెండు నిమిషాల పాటు అయినా పళ్లను రుద్దాలి. అప్పుడే చిగుళ్లు సైతం శుభ్రం అవుతాయి.
- పళ్లు తోముకోవడం ఎంత ముఖ్యమో.. నాలుకను శుభ్రం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది సరిగా చేయకపోవడం వల్లే నోటి దుర్వాసన, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. టూత్ బ్రష్ తో అయినా సరే నెమ్మదిగా నాలుకను శుభ్రం చేయాలి. లేకపోతే టంగ్ క్లీనర్ వాడాలి.
- నాలుక అయిన తర్వాత మౌత్ వాష్ తో పుక్కిలుంచాలి. దీనివల్ల పళ్లు తెల్లగా అవ్వడమే కాదు.. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. చిగురువాపు సమస్య కూడా ఇది సరైన పరిష్కారం. మౌత్ వాష్ వద్దనుకుంటే కొబ్బరినూనెతో కూడా ఇలా చేయొచ్చు.
- నీళ్లు ఎంత తాగితే అంత ఆరోగ్యంగా ఉంటామనే విషయం తెలుసు కదా! దంతాల సమస్యకు కూడా నీళ్లు తగ్గిస్తాయి. హానికారకమైన బ్యాక్టీరియాను బయటకు పంపించడంలో ఇది సహాయపడుతుంది. దంత క్షయాన్ని కూడా తగ్గిస్తుంది.
- విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. టమాటాలు, జామకాయలు, నారింజ వంటి పండ్లను మీ ఆహారంలో చేర్చుకుంటే సరిపోతుంది.
- పంటి నొప్పి బాధిస్తుంటే.. 2 లేదా 3 లవంగాలను ఆ పంటి పై ఉంచండి. లవంగాల్లోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పంటి నొప్పిని తగ్గిస్తాయి.
- పుదీనా టీ బ్యాగ్ ఉందా? అయితే దీన్ని వేడి నీటిలో కాసేపు ఉంచి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టి చూడండి. ఇది నొప్పి నివారిణిగా పని చేస్తుంది. అంతేకాదు.. చిగుళ్ల నుంచి రక్తస్రావం అయినప్పుడు కూడా దీన్ని వాడితే మంచిది.