జింబాబ్వేకు చెందిన క్రిస్టీ కోవెంట్రీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ. అంతేకాదు తొలి ఆఫ్రికన్ కూడా. రెండుసార్లు ఒలింపిక్స్లో స్విమ్మింగ్లో స్వర్ణం సాధించింది.
41 యేండ్ల వయసులో కోవెంట్రీ ఈ పదవిని చేపట్టింది. ఈ క్రీడా పాలనలో అత్యంత శక్తివంతమైన స్థానానికి ఎన్నికైన అతి పిన్న వయస్కురాలు కూడా ఆమె. ముందున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ఐఓసి సభ్యులలో ఎక్కువ మంది ఆమెపై విశ్వాసం ఉంచారు. అందుకే 97 ఓట్లలో కోవెంట్రీకి 49 ఓట్లు వచ్చాయి. 2033 వరకు ఆమె ఈ పదవీలో కొనసాగుతారు.
2028లో లాస్ ఏంజిల్స్ తదుపరి వేసవి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్నందున కోవెంట్రీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పని చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో అమెరికన్ అధ్యక్షుడు కొన్ని దేశాల అథ్లెట్లను నిషేధించడం ద్వారా ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నిస్తే అంటూ ప్రశ్న తలెత్తింది. దానికి ఆమె చిరునవ్వుతో.. 20 సంవత్సరాల వయసు నుంచి ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాను. అక్కడి నుంచి నేను నేర్చకున్నది ఏమిటంటే కమ్యూనికేషన్ కీలకం. అది ముందుగానే చేస్తాను అంటూ సమాధానమిచ్చింది. అంతేకాదు.. మహిళల క్రీడను రక్షించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

ఎవరీ క్రిస్టీ..
జింబాబ్వే రాజకీయ ప్రపంచంలో.. కోవెంట్రీ ఆపదలను తప్పించుకొని ఉన్నత స్థాయికి ఎదగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్లో ఆమె ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ స్విమ్మింగ్ పూల్లో మూడు పతకాలు గెలుచుకుంది. ఆ సమయంలో రాబర్ట్ ముగాబే ఆమెను జింబాబ్వే “గోల్డెన్ గర్ల్”గా ప్రశంసించారు.
2008లో బీజింగ్లో మరో నాలుగు పతకాలు గెలుచుకుంది. అయితే అధిక ద్రవ్యోల్బణం ఫలితంగా జింబాబ్వే ప్రజలు ఆకలితో అలమటిస్తున్న సమయంలో కోవెంట్రీ రాష్ట్ర టెలివిజన్లో $100,000 (సుమారు £55,000) ప్రైజ్ మనీని స్వీకరించినందుకు విమర్శలను ఎదుర్కొన్నారు.
2018లో ఆమె ఎమర్సన్ మ్నంగాగ్వా మంత్రివర్గంలో క్రీడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా వివాదం చెలరేగింది . అయితే కోవెంట్రీ మ్నంగాగ్వా నుంచి దూరం కాలేదు. గత సంవత్సరం జింబాబ్వే 2027 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బిడ్ వేయాలనుకుంటున్నట్లు చెప్పిన ఒక బహిరంగ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. క్రీడా మంత్రిగా కోవెంట్రీ విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. 2020 నుంచి జింబాబ్వే జాతీయ జట్టు ఆటలను నిర్వహించకుండా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్బాల్ నిషేధించింది.
కోవెంట్రీ ఒలింపిక్ కమిటీకి ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో తన పాత్ర, చర్యలను సమర్థించుకుంది. ఎందుకంటే.. చాలా మంది అభ్యర్థుల మాదిరిగా కాకుండా ఆమె ప్రచారానికి ఖరీదైన పీఆర్ బృందం లేదు. నిజానికి ఆమె మ్యానిఫెస్టోను ఆమె, ఆమె భర్త రాశారు. ఆమెకు సహాయం చేసిన ఒక కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ దానిని ఉచితంగా చేశాడు.