నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. రోగనిరోధక శక్తిని పెంచే ఈ డ్రై ఫ్రూట్స్ ని ఖాళీ కడుపుతో తింటే మరింత మంచిది.
బాదం, వాల్ నట్, ఎండు ద్రాక్ష, అత్తి పండ్లు.. వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటే పోషకాలు రెట్టింపవుతాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరం రోజంతా శక్తిని నిలుపుకుంటుంది. సరైన జీర్ణక్రియకు, చర్మాన్ని మెరిసేలా చేసే వాటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
బాదం : సాధారణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నానబెట్టిన బాదం పప్పును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తప్పనిసరిగా తీసుకోవాలి. బాదం నిజానికి చాలా పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి అనేక సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఎండు ద్రాక్ష : నల్ల ఎండు ద్రాక్షను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే జుట్టు రాలడం తగ్గుతుంది. పీరియడ్ పెయిన్ లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య బాధిస్తుంటే రాత్రిపూట ఆరు నుంచి ఎనిమిది ఎండు ద్రాక్షలను తీసుకుంటే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
వాల్ నట్స్ : రాత్రిపూట నానబెట్టిన వాల్ నట్స్ మరుసటి రోజు ఉదయం వాటి పనితీరును మరింత పెంచుతాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. చదువు మీద శ్రద్ధను పెంచుతాయి. చదువుకునే పిల్లలకు వీటిని రోజూ అందించడం చాలా మంచిది.
అత్తి పండ్లు : మీకు మలబద్దకం సమస్య ఉందా? అయితే రాత్రంతా వాటిని నానబెట్టి మరుసటి రోజు పరగడుపున తినేయండి. కొన్నిరోజుల పాటు చేస్తే మలబద్దక సమస్య చాలావరకు తగ్గుతుంది. తల్లి కావాలనుకునే వారు కూడా రోజూ నాలుగైదు నానబెట్టిన అత్తిపండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది.