రంగుల పండుగ రోజున ఎక్కువగా తెలుపు రంగు దుస్తులు వేసుకోవడం చూశాం. కానీ తెలుపు రంగునే ఎందుకు వేసుకుంటారని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఒక కారణం ఉందని ఎప్పుడైనా అనుకున్నారా?
హోలీ అంటేనే రంగులను చల్లుకోవడం. అలాంటప్పుడు రంగుల బట్టలు వేసుకోవడం ఎందుకని తెల్లని బట్టలు వేసుకుంటే రంగులు బాగా కనపడతాయని అనుకుంటారు. కానీ హిందూ ఆచారాలలో తెలుపు రంగును స్వచ్ఛతకు , ప్రాపంచిక కోరికల నుంచి నిర్లిప్తతకు చిహ్నంగా చూస్తారు. తెల్లని దుస్తులు ధరించడం అనే ఆలోచన మలినాల నుంచి తనను తాను శుభ్రపరచుకోవడం కూడా. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక పునరుద్ధరణను సూచిస్తుంది. జ్ఞానోదయానికి దగ్గరగా ఉంటుంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రాహువు హోలీ సమయంలో కోపంగా ఉంటాడు. ఇది ప్రజల ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. చెడు సహవాసంలో పడడం, కఠినంగా మాట్లాడటం, కుటుంబ సభ్యులతో సంబంధాలు దెబ్బతినడం వంటివి ఇందులో ఉన్నాయి. రాహువు కోపం ప్రతికూల ప్రభావాల నుంచి తనను తాను రక్షించుకోవడానికి, ప్రజలు హోలీ వేడుక సమయంలో తెల్లని దుస్తులు ధరిస్తారు. తెల్లని దుస్తులు ప్రతికూల శక్తిని తటస్థీకరిస్తాయని, రాహువు కోపం ప్రభావాలకు ప్రజలు లొంగిపోకుండా నిరోధించడానికి రక్షణ కవచంగా పనిచేస్తాయని భావిస్తారు. ముఖ్యంగా తెల్లని దుస్తులు ధరించడం పండుగల సమయంలో శాంతి, స్వచ్ఛత, సామరస్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు.
తెలుపు అనేది శాంతిని సూచించే రంగు. అనేక మతాలలో.. తెల్లని దుస్తులు ధరించడం అనేది ఉన్నత శక్తితో కనెక్ట్ అవ్వడానికి, దైవిక శక్తికి దగ్గరగా ఉండడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. దీనిని సోదరభావం, శాంతి, ఆనందం, శ్రేయస్సు చిహ్నంగా భావిస్తారు. భారతదేశంలో ఎండకాలం మొదలయ్యేది కూడా ఇప్పుడే. అందుకే తెల్లని దుస్తులు సూర్యరశ్మిని గ్రహించడానికి బదులుగా దానిని ప్రతిబింబిస్తాయని అంటారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది.