సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. మార్చిలో భూమ్మీదకు చేరనున్నారు. తిరిగొచ్చాక కండరాల నష్టం, ఎముక బలహీనత, తీవ్రమైన అంతరిక్ష ప్రయాణ ప్రభావాలతో వ్యోమగాములు ఎలా పోరాడుతారనేది ఇప్పుడు చర్చనీయాంశం.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలకు పైగా గడిపిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 2025 మార్చి మధ్యలో భూమికి తిరిగి రానున్నారు. విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల వారు తిరిగి భూమ్మీదకు వచ్చినప్పుడు వారి ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉండేదనే దానిమీద ఇప్పుడంతా చర్చ జరుగుతుంది. కండరాల క్షీణత నుంచి హృదయనాళ మార్పుల వరకు ఉన్న ఈ ప్రమాదాలు, దీర్ఘకాలిక మిషన్లను ప్లాన్ చేసే అంతరిక్ష సంస్థలకు ప్రధాన ఆందోళన కలిగిస్తున్నాయి.
భూమిపై, గురుత్వాకర్షణ నిరంతరం శరీరంపై పనిచేస్తుంది. కండరాలు, ఎముకల బలం ఉండేలా చేస్తుంది. అయితే అంతరిక్షంలో గురుత్వాకర్షణ గణనీయంగా బలహీనంగా ఉన్న చోట, వ్యోమగాములు నిలబడటానికి లేదా కదలడానికి వారి కాళ్ళను ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఫలితంగా కండరాలు బలహీనపడతాయి. ఎముక ద్రవ్యరాశి తగ్గుతుంది. ఈ ప్రభావాలను ఎదుర్కోవడానికి, ISS లో ఉన్న వ్యోమగాములు ప్రతిరోజూ రెండు గంటలు వ్యాయామం చేస్తారు. అంతరిక్షంలో ఎముకల నష్టాన్ని నిరోధించే మందులను పరీక్షించడానికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఎదుర్కొనే ఆరోగ్య సవాళ్లు..
- మైక్రోగ్రావిటీకి ఎక్కువసేపు గురికావడం వల్ల ఎముకలు తగ్గుతాయి, ముఖ్యంగా కాళ్ళు మరియు వెన్నెముక వంటి బరువు మోసే ప్రాంతాలలో. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల కండరాల శ్రమ అవసరం తగ్గుతుంది, కాలక్రమేణా కండరాలు బలహీనపడతాయి.
- అంతరిక్షంలో రక్తాన్ని పంప్ చేయడానికి శరీరం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి రక్త పరిమాణం తగ్గుతుంది. ప్రసరణపై ప్రభావం చూపుతుంది. పనిభారం తగ్గడం వల్ల గుండె పరిమాణం తగ్గిపోతుంది. తిరిగి వచ్చినప్పుడు భూమి గురుత్వాకర్షణకు సర్దుబాటు చేయడం కష్టమవుతుంది.
- మైక్రోగ్రావిటీలో ద్రవ మార్పులు ఇంట్రాక్రానియల్ ఒత్తిడిని పెంచుతాయి, దృష్టిని ప్రభావితం చేస్తాయి. ఈ మార్పుల కారణంగా చాలా మంది వ్యోమగాములు దృష్టి లోపాలతో భూమికి తిరిగి వస్తారు.
- ఒంటరితనం వల్ల, పరిమిత జీవన పరిస్థితుల కారణంగా విస్తరించిన అంతరిక్ష యాత్రలు ఒత్తిడి, ఆందోళన మరియు మానసిక రుగ్మతలకు దారితీయవచ్చు. పైగా అంతరిక్షంలో నిద్ర సమయం కూడా సరిగా ఉండదు. ఒకవేళ నిద్రపోవాలంటే మందులపై ఆధారపడతారు. దానివల్ల కూడా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారు.
ఈ సమస్యల వలయంలో సునీతా విలయమ్స్ ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే ఆవిడ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఒకవేళ ఇందులో ఏ సమస్య ఎదుర్కొన్న కూడా ఆమె కోలుకోవడానికి మాత్రం చాలా సమయమే పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.