హిందూ మతంలో దేవాలయాలకు వెళ్లడం, అది కుదరకపోతే ఇంట్లో పూజ చేయడం పరిపాటే. కానీ ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలు, పటాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ప్రతీ హిందువు ఇంట్లో దేవుని గది లేదా కొంత స్థలంలోనైనా దేవుని కోసం కేటాయిస్తుంటారు. ప్రతిరోజూ ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే సానుకూల శక్తి, ఇంట్లో శాంతి ఉంటాయని చెబుతారు. పూజ చేసే ప్రాంతంలో అందమైన దేవుళ్ల పటాలను, విగ్రహాలను పెట్టుకోవడం మామూలే. రోజూ పూజాదికాలు చేస్తుంటారు. మరికొందరు ప్రత్యేకమైన రోజుల్లో, పండుగల పూట మాత్రమే పూజ చేస్తుంటారు. కొన్నిసార్లు విగ్రహాలు, ఫోటోలు అందంగా ఉన్నాయని కొనేసి దేవుడి గదిలో పెడుతుంటారు. అయితే కొందరు తెలిసి, తెలియక దేవుడి విగ్రహాలు, ఫోటోల విషయంలో చేసే కొన్ని పొరపాట్లు చాలా ఇబ్బందులకు దారి తీస్తాయి.
శివలింగాలు..
శివలింగ స్థలం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి. ఇంట్లో రెండు శివలింగాలను ఉంచడం వల్ల మానసిక క్షోభ కలుగుతుంది. ఒక్క శివలింగాన్ని మాత్రమే పూజించాలి.

వినాయక విగ్రహాలు..
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి తొలిపూజ చేస్తాం. అయితే మూడు గణపతి విగ్రహాలను ఇంట్లో ఉంచినట్లయితే అది అశుభ ఫలితాలను ఇస్తుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లేదా ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుందని నమ్ముతారు.
దుర్గా విగ్రహాలు..
దుర్గా దేవి శక్తి స్వరూపం. కానీ ఇంట్లో మూడు దుర్గా విగ్రహాలు ఉంచినట్లయితే అది గృహ జీవితానికి అనుకూలమైనది కాదని అంటారు.
గోమతి చక్రాలు..
గోమతి చక్రం ఆనందం, శ్రేయస్సు చిహ్నం. అయితే ఇంట్లో రెండు గోమతి చక్రాలను ఉంచడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.
శంఖాలు..
శంఖం చాలా పవిత్రమైనది. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. అర్చనలు, అభిషేకాలు చేసేటప్పుడు శంఖం ఉపయోగిస్తే ఆ పూజా ఫలం మరింత పెరుగుతుంది. అలాగే పూజల సమయంలో శంఖానాదం చేయడం వల్ల దేవుడు ప్రసన్నం అవుతాడు. కానీ ఇంట్లో రెండు శంఖాలు ఉంచడం సరికాదని భావిస్తారు.
సూర్య విగ్రహాలు..
సూర్య భగవానుడు శక్తికి చిహ్నంగా పరిగణించబడతాడు. ఈయన ప్రత్యక్ష దైవం. అయితే ఇంట్లో రెండు సూర్య విగ్రహాలు లేదా సూర్య పటాలు ఉంచడం వల్ల అననుకూల ప్రభావాలు ఉంటాయి.
శాలిగ్రామాలు ఉంటే..
శాలిగ్రామాలు విష్ణువు చిహ్నాలుగా పరిగణిస్తారు. సాధారణంగానే శాలిగ్రామం పూజ చేసుకోవాలి అంటే చాలా నిష్ట ఉండాలి. ఆడవారు నెలసరి కలుపుకునే ఇంట్లో శాలిగ్రామం ఉంచి పూజ చెయ్యడం వల్ల మేలు కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. రెండు శాలిగ్రామాలు ఉంచుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ఇవికాకుండా విరిగిపోయిన విగ్రహాలు, చిరిగిపోయిన చిత్రపటాలు, పగిలిపోయిన ఫ్రేములు ఉంచకూడదు. అలాగే నవగ్రహాల విగ్రహాలను, ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలను కూడా పెట్టకూడదు.