భారతీయులు.. పాకిస్తానీయులు స్నేహితులుగా ఉండగలరా? అసలు ఇదేం ప్రశ్న అనిపించొచ్చు. కానీ దేశాలకే అడ్డుగోడలు కానీ స్నేహానికి ఇవేవీ ఉండవని నిరూపిస్తున్నారీ అమ్మాయిలు.

భారత్-పాక్ సరిహద్దులో.. క్రికెట్ మైదానంలో, రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ స్నేహంగా ఈ రెండు దేశాలు ఉండలేవా? అది సాధ్యమవుతుందో లేదో తెలియదు. కానీ సరిహద్దులను చెరిపేసి తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. దానికి సోషల్మీడియాలో కూడా మంచి స్పందన లభిస్తున్నది. హార్వార్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ స్నేహా బిస్వాస్ తన కథను సోషల్ మీడియాలో పంచుకున్నది. ఆమె జంషెడ్పూర్ దగ్గర ఒక చిన్న గ్రామంలో పుట్టింది.. ఆమెకు తెలిసింది.. ఇండియా పాకిస్తాన్ మధ్య వైరం గురించి పుస్తకాలు, సినిమాలను చూసి పెరిగింది. కాకపోతే ఆ చిన్న మనసుకు ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. అసలు ఎందుకు ఈ దేశాల మధ్య వైరం ఉంటుందో అప్పుడు తెలియలేదు. తను పెరిగిన తర్వాత కూడా తెలుసుకోవాలనుకోలేదు.
స్నేహం కోసం..
2018 సంవత్సరం ఆమె ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. హార్వర్డ్ యూనివర్సిటీలో అదే ఆమెకు మొదటిరోజు. ఆ సమయంలో అందరి పరిచయ కార్యక్రమం జరుగుతున్నది. అప్పుడే పాకిస్తానీ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. వారి బంధం స్నేహంగా మారింది. ఆ సమయంలో దేశల మధ్య వైరం గుర్తుకు రాలేదు. బిర్యానీ, చాయ్, క్రికెట్ ఇలా.. ప్రతీ విషయంలోనూ వారి అభిరుచులు కలవడంతో స్నేహం మరింత బలపడింది. ఈద్.. దీపావళి ఇలా అన్ని పండుగలను కలిసి చేసుకునేవారు. అలాగే ఇద్దరికీ ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. అందుకే యూఏస్ఏలో చాలా ప్రదేశాలను తిరిగారు. అక్కడి నుంచి తిరిగి ఎవరి దేశాలకు వెళ్లినా వారి స్నేహం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఎలా రియాక్టయ్యారంటే..
ఈ స్నేహితుల గురించి కథనాల గురించి చాలా మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు దేశాల మధ్య వైరం ఉంటే ఎలా స్నేహం చేస్తారంటూ విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ అమ్మాయిల స్నేహాన్ని పొగుడుతున్నారు. ఇలా అయినా రెండు దేశాల మధ్య స్నేహభావం పెరుగాలని ఆశిస్తున్నారు. ఇండో-పాక్ స్నేహం రెండు దేశాల పౌరులు శాంతితో సందర్శించేలా జరుగాలని ఆశిస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.