బ్యాట్ పట్టుకుంటే సింగిల్స్.. సిక్సర్లను బాదే విరాట్ కోహ్లీ గురించి అందరికీ తెలుసు. అలాగే ఎంతో ప్రేమించే భర్తగా కూడా సుపరిచితుడు. కానీ ఆయన చేసే మంచి పనుల గురించి తెలిస్తే రియల్ హీరో అనకమానరు.

కోహ్లీ.. ఒక క్రికెటర్, మోడల్ ఇలా నాణానికి ఒక వైపు మాత్రమే అందరూ గుర్తుపడుతారు. ప్రస్తుతం మన దాయాది దేశం మీద సెంచరీ చేసి కోహ్లీ ఫామ్లో కొచ్చాడు అంటున్నారు. ఈ సెంచరీ ఏమీ కోహ్లీకి కొత్త కాదు. తన విజయాలను తన కొంత మంచి కోసం ఉపయోగిస్తున్నాడని మీకు తెలుసా? కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియనివ్వద్దు అని పెద్దలు అంటారు. ఆ మాటలు విన్నాడేమో కోహ్లీ. అందుకే తను చేసే మంచి పనులు ఎక్కడా చెప్పుకోడు. పేదరికంతో బాధపడుతున్న ఎందరికో తానున్నానంటూ బాసటగా నిలుస్తున్నాడు. మరి ఆ రియల్ హీరో చేసే పనుల గురించి తెలుసుకుందామా..?!
పిల్లల భవిష్యత్తుకు..

అవకాశం వస్తే ఎవరైనా దేన్నైనా సాధించగలరు. ఆ అవకాశాలు రాక ఎందరో ఎదురుచూసేవాళ్లున్నారు మన దేశంలో. తనకు క్రికెట్ ఒక సుగమమైన మార్గాన్ని అందించందంటాడు కోహ్లీ. అందుకే విరాట్ కోహ్లీ ఫౌండేషన్(వీకేఎఫ్) అనే పేరుతో ఎన్జీవోని స్థాపించి దేశంలో ఉన్న పిల్లల భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని భావించాడు. దీని ద్వారా పేద పిల్లల చదువు, ఆరోగ్యం, క్రీడా శిక్షణలో వెనుకబడిన వారికి సహాయం అందిస్తున్నాడు. కోహ్లీ కేవలం విరాళం ఇచ్చి ఊరుకోవడం లేదు. వారి భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంలో తానే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. వీకేఎఫ్ ద్వారా ప్రతిభ ఉండి శిక్షణ తీసుకులేని యువ క్రీడాకారులకు ప్రత్యేక స్కాలర్షిప్లు కూడా అందుతాయి.
మానసికంగా బాధపడేవారికి..
చాలామంది క్రికెటర్లనే కాదు.. సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవారేవరూ తమకు ఉన్న బాధలను బయటకు చెప్పుకోరు. అలాంటిది కోహ్లీ మాత్రం తను ఉన్న మానసిక బాధను అందరితో పంచుకున్నాడు. ఆందోళన, అంచనాల ఒత్తిడితో తాను ఎదుర్కొన్న పోరాటాల గురించి చెప్పాడు. శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును కూడా జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో ఒకానొక సందర్భంలో బహిరంగంగానే తెలిపాడు. తాను పడిన బాధలాగే ఎవరూ పడకూడదని భావించాడు. అందుకే ఈ ఫౌండేషన్ కొందరు మానసిక వైద్యులతో కలిపి పనిచేస్తున్నది. సహాయం కావాలన్నవారికి సత్వరంగా సేవలను అందిస్తున్నది.
కోవిడ్ నుంచే..
కోహ్లీ మాత్రమే కాదు.. ఆయన భార్య అనుష్క శర్మ కూడా దాతృత్వంలో ముందే ఉంటుంది. కోవిడ్-19 సమయంలో కోట్లలో దానాలు చేశారీ దంపతలు. ఆహారం, మెడికల్.. ఇలా ఎన్నో రకాలుగా, ఎంతోమందికి సహాయం చేశారు. అక్కడితో వీరి సేవలు ఆగలేదు. కోహ్లీ హంగర్ రిలీఫ్ పేరుతో జొమాటలో ద్వారా ఎంతోమంది ఆకలిని తీర్చాడు. రోజువారీ కూలీలు, పేద పిల్లలకు వీరి ఫౌండేషన్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. దేశంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదనేది వీరి ఉద్దేశ్యం.
జంతువుల కోసం..
కోహ్లీకి క్రికెట్ మీదనే ప్రేమకాదు.. జంతువులన్నా మక్కువ ఎక్కువ. జంతుహక్కుల కోసం కూడా తాను ఎన్నోసార్లు గళం విప్పాడు. అంతేకాదు.. గాయపడిన జంతువులకు సేవలను అందించాడు. ఎన్నో జంతువులకు ఆశ్రయం ఇచ్చాడు. యానిమల్ వెల్ఫేర్ పేరిట 2023నుంచి గాయపడిన జంతువులకు ట్రీట్మెంట్ చేయించడం మొదలుపెట్టాడు. చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం వంటి కారణాలకు మద్దతు ఇస్తూ, పర్యావరణ ప్రచారాలలో కూడా ఆయన భాగమయ్యారు. జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమ కేవలం మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపిస్తున్నాడు.

వృద్ధులకు మద్దతుగా..
2016లో కోహ్లీ ఫౌండేషన్ ఎబిల్ ఫౌండేషన్తో కలిసి అభల్మయ అనే ఓల్డ్ ఏజ్ హోమ్ని బాగు చేయించాడు. 57మంది వృద్ధులను అన్నిరకాలుగా ఆదుకున్నాడు. ఆ హోమ్కి వెళ్లి పర్సనల్గా ఆ ముసలివాళ్లను కలుసుకొని వారి బాగోగులను చూసుకున్నాడు. ఇప్పటికే ఆ హోమ్కి బాసటగానే నిలిచాడు.
క్రికెటే కాదు..
క్రికెట్కి సంబంధించిన క్రీడాకారులనే కాదు.. ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలా ఇతర ఆటగాళ్లను కూడా తన ఫౌండేషన్ ద్వారా ప్రోత్సహిస్తున్నాడు. వారికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాడు. తమ కలలను సాకారం చేసుకునే దిశగా ఆ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాడు. ఒలింపిక్స్ వెళ్లే ఎంతోమంది క్రీడాకారులకు కూడా విరాట్ కోహ్లీ ఫౌండేషన్ తమ సహకారాన్ని అందిస్తున్నది.