ఉదయం.. సాయంత్రం.. టైం ఏదైనా ఒక చుక్క టీ పడకపోతే రోజు గడువదు. టీ లేకుండా రోజు అసంపూర్ణంగా అనిపించేవాళ్లుంటారు. కాఫీ ప్రియులకు కూడా అలాగే ఉంటుంది. అయితే వీటితో కొన్ని తింటే ఆరోగ్యానికి ప్రమాదమే!
చాలామందికి వేడి వేడి తేనేటీ విందుతో బిస్కెట్లు, పకోడి, నమ్ కీన్ వంటి అనేక స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అది చాలా వరకు అద్భుతంగా అనిపిస్తుంది. అయితే అందులో కొన్ని మన శరీరానికి హాని కలిగించే స్నాక్స్ ఉన్నాయని మనం గుర్తించలేం. మీరు కూడా టీతో స్నాక్స్ తినాలనుకుంటే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. టీతో దూరంగా ఉండాల్సిన ఆహారాల జాబితాను మీకు అందిస్తున్నాం.
శనగపిండితో..
మామూలుగా పకోడీలు తింటూ టీ తాగడం చాలా వరకు అలవాటు ఉంటుంది. నమ్కీన్, భుజియా వాటితో కూడా టీ తాగడానికి ఇష్టపడుతారు. వీటిని శనగపిండితో తయారు చేశారు. శనగపిండితో తయారు చేసిన చిరుతిళ్లు జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. అయితే పోషకాలను గ్రహించడంలో శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
చల్లనివి..
ప్రతి ఇంట్లో సాధారణ అల్పాహారం పెరుగు, పచ్చళ్లు, వేడి టీతో పరోటాలను లాగిస్తుంటారు. కానీ ఈ కలయిక జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. మీకు వికారం కూడా కలుగవచ్చు. అందుకే టీ వంటి వేడి పానీయాన్ని తాగిన తర్వాత కనీసం 30 నిమిషాల పాటు చల్లని ఆహారం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

పసుపుతో..
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రతిరోజూ తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఇది టీతో తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిన పదార్థం. ఎందుకంటే పసుపు ఉన్న ఆహారాలు కడుపులో గ్యాస్, మలబద్దకాన్ని కలిగిస్తాయి.
నిమ్మరసంతో..
లెమన్ టీ తాగినప్పుడు అసిడిక్ రియాక్షన్ వస్తుందని ఎవరైనా చెప్పడం విన్నారా? నిమ్మకాయలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల వికారం, ఉబ్బినట్లు అనిపించవచ్చు. నిమ్మరసం టీని మరింత ఆమ్ల స్వభావం కలిగిస్తుంది. అందుకే ఉదయం లెమన్ టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.

ధాన్యాలు..
టీలో టానిన్లు, ఆక్సలేట్ ఉంటాయి. ఇవి ఇనుము శరీరంలో శోషించకుండా నిరోధిస్తుంది. అందువల్ల ఎల్లప్పడు ఒక కప్పు వేడి టీతో ఏమీ తీసుకోకూడదు. ముఖ్యంగా నట్స్, ధాన్యాలు, ఆకుకూరల వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ కు దూరంగా ఉండేలా చూసుకోండి.