శివ‌రాత్రికి జాగారం ఎందుకు చేస్తారు?

శివ‌రాత్రి రోజున ఉప‌వాసం, జాగారం చేయ‌డం అనాదిగా వ‌స్తున్న‌ది. అయితే అస‌లు ఆ రోజు జాగారం ఎందుకు చేయాలో తెలుసా?  శివుడికి బిల్వ‌ప‌త్రాలు స‌మ‌ర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయ‌ట నిజ‌మేనా?

శివ‌య్య‌.. భోళాశంక‌రుడ‌ని తెలుసు. పిలిస్తే ప‌లికే దైవం ఆయ‌న‌. మ‌రి ఆయ‌న‌కు శివ‌రాత్రి రోజున ప‌డుకోకుండా ఉండాల‌నే నియ‌మం ఎప్పుడు మొద‌లైందో తెలుసుకోవాలని ఉంది క‌దా! ఇంకో విష‌యం.. శివ‌రాత్రికి జింక‌ల‌కి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. బిల్వ‌ప‌త్రాల స‌మ‌ర్ప‌ణ కూడా ఆ రోజై మొద‌లైంది. స్కంద‌పురాణంలో, ప‌ద్మ పురాణంలో ఈ శివ‌రాత్రి గురించి చాలా విష‌యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉప‌వాసం, జాగారం ఎందుకు చేస్తారో న‌ని శివుడు పార్వ‌తికి వివ‌రించాడు. శివ‌పార్వ‌తుల వివాహం జ‌రిగిన రోజున పార్వ‌తీ దేవి శివుడిని నిష్టగా కొలిస్తే ఏమవుతుంద‌ని అడిగింది. అప్పుడు శివుడు పార్వ‌తికి ఒక క‌థ చెప్పాడు.

ఆ క‌థ‌..

ఒక కొండ ప్రాంతంలో ఒక వేట‌గాడు ఉండేవాడు. రోజూ అడ‌వికి వెళ్లి జంతువుల‌ని చంపి త‌న కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు. ఒక‌రోజు ఒక్క జంతువు కూడా క‌నిపించ‌లేదు. ఖాళీ చేతుల‌తో ఇంటికి ఏం వెళ్లాల‌ని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆ స‌మ‌యంలో ఒక కొల‌ను క‌నిపించింది. ఈ కొల‌నులో నీళ్లు తాగ‌డానికి ఏదో ఒక జంతువు వ‌స్తుంది. అప్పుడు వేటాడి ఆ జంతువును చంపి ప‌ట్టుకెళ్లొచ్చ‌ని భావించాడు. రాత్రి కావ‌డంతో అక్క‌డే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చ‌లికి వ‌ణుకుతూ శివ శివా అని త‌న ఊత‌ప‌దం అంటూ ఉన్నాడు. ఖాళీగా కూర్చోలేక చెట్టు కొమ్మ‌ల‌ను తెంపుతూ కింద‌కి ప‌డేస్తున్నాడు. అప్పుడే అటుగా ఒక జింక వ‌చ్చింది. వెంట‌నే బాణం ఎక్కుపెట్టేస‌రికి ఆ జింక త‌న‌ని చంప‌కుండా విడిచిపెట్ట‌మ‌ని, ఏ జంతువు రాక‌పోతే త‌నే తిరిగి వ‌స్తాన‌ని చెప్పింది. అయితే అది మాన‌వ‌గొంతుతో మాట్లాడుతుండ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయాడు వేట‌గాడు. ఏదో తేడా ఉంద‌ని భావించి ఆ జింక‌ను వ‌దిలేశాడు. రాత్రి నిద్ర మానుకొని ఇంకొక జంతువు కోసం ఎదురుచూశాడు. ఈసారి మరొక జింక వ‌చ్చింది. దాని మీద విల్లు ఎక్కు పెట్టేస‌రికి త‌న ఒంటి మీద మాంసం లేద‌ని వ‌దిలేయ‌మ‌ని వేడుకొన్న‌ది. పైగా వేట‌గాడికి ఆహారం దొర‌క‌క‌పోతే తానే వ‌స్తాన‌ని మాట ఇచ్చి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఆక‌లితో ఉన్న ఆ వేట‌గాడికి ఇంకో జింక క‌నిపించింది. దాన్ని చంప‌బోతుండ‌గా తాను గ‌ర్భ‌వ‌తిన‌ని చెప్పింది. పైగా ప్ర‌స‌వించి వ‌చ్చి వ‌స్తాన‌ని మాట ఇచ్చి వెళ్లింది.

చివ‌ర‌గా మ‌గ జింక వ‌చ్చి ఇటు వైపు ఆడ జింక‌లు వ‌చ్చాయా అని వేట‌గాడిని ఆరా తీసింది. అయితే వేట‌గాడికి ఉన్న అనుమానం తీర్చుకోవాల‌ని ఈ జింకను ప్ర‌శ్నించాడు. మీరు ఎలా మాట్లాడుతున్నార‌ని. దానికి ఆ జింక *నేను హిరణ్య‌క్షుడ‌ను. ఇంత‌కు ముందు వ‌చ్చిన జింక నా భార్య అప్స‌ర‌స రంభ‌. శివుని పూజ‌ని మ‌ధ్య‌లో ఆపి రాక్ష‌సుడైన న‌న్ను పెండ్లి చేసుకుంది. మా కామ‌వాంఛ‌కి శిక్ష‌గా జింక‌లా పుట్ట‌మ‌ని, వేట‌గాని విల్లు చేత చ‌నిపోవాల‌ని రుద్ర‌డు శపించాడ‌ని* చెప్పి ఉద‌య‌మే వ‌స్తాన‌ని చెప్పి వెళ్లిపోతుంది. మాట ఇచ్చిన‌ట్టే ఆ నాలుగు జింక‌లు పొద్దున్నే వ‌చ్చి త‌మ‌ని చంప‌మ‌ని కోరుతాయి. అయితే వాటి మంచి గుణం చూసి వేట‌గాడి మ‌న‌సు చ‌లించిపోతుంది. *ఇచ్చిన మాట‌కోసం, ప‌క్క‌వారిని బ‌తికించ‌డం కోసం చావుకు సిద్ధ‌మ‌య్యారు. వెళ్లిపోయి సంతోషంగా బ‌తుకండి* అని చెబుతాడు.

దేవ‌త‌లు ప్ర‌త్య‌క్ష‌మ‌యి ఆ వేట‌గాడికి స్వ‌ర్గ‌లోక ప్రాప్తి క‌ల్పిస్తూ జింక‌ల‌ని దీవించి న‌క్ష‌త్రాల రూపంలో ప్ర‌కాశిస్తార‌ని దీవిస్తారు. అలా మృగ‌శిర అనే న‌క్ష‌త్రం ఏర్ప‌డుతుంద‌ని అదే రోజున శివ‌రాత్రి జ‌రుపుకోవాల‌ని చెబుతారు. ఆ వేట‌గాడు ఎందుకు ఇదంతా జ‌రిగింద‌ని దేవ‌త‌ల‌ను ప్ర‌శ్నించ‌గా *నువ్వు కూర్చున్న‌ది మారేడు చెట్టు. ఆ చెట్టు కింద స్వ‌యంభూలింగం వెలిసి మ‌రుగున ప‌డిపోయింది. దాన్ని తెలియ‌కుండా ఆ బిల్వ ప‌త్రాల‌తో అర్చించావు. ప‌డుకోకుండా శివ నామ‌స్మ‌ర‌ణ చేశావు. శివునిచే శ‌పించ‌బ‌డిన ఆ జింక‌ల‌ని నీ ద‌య వ‌ల్ల శాప‌విమోచ‌న గావించావు* అని చెబుతారు.

మూడు ముఖాలు క‌లిగిన మారేడు ఆకులు బ్ర‌హ్మ‌, విష్ణు స్వ‌రూపాలుగా భావించాలి. అలాగే క్షీర‌సాగ‌ర మ‌థ‌నంలో శివుడు విషాన్ని తాగాడు. ఆ స‌మ‌యంలో త‌న గొంతు నీలంగా మారింది. అంతేకాదు.. మంట పుట్ట‌డంతో ఆ బిల్వ ఆకుల ప‌స‌రుని తాగ‌డం వ‌ల్ల ఆ నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందిన‌ట్టు పురాణాలు చెబుతున్నాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress